కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. మరోవైపు కరోనాను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా వైరస్ వ్యాప్తిని కట్డడి చేయలేక పోతున్నాయి, అయితే న్యూజిలాండ్ మాత్రం ఆ ఘనతను దక్కించుకుంది. ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేని దేశంగా నిలిచింది.
దేశంలో నమోదైన చిట్టచివరి కరోనా వైరస్ బాధిత మహిళ కోలుకుందని ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ ప్రకటన చేశారు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్కు చెందిన ఆ కరోనా బాధిత మహిళ సెయింట్ మార్గరెట్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ఇప్పుడు ఆ దేశంలో ఒక్క కరోనా యాక్టివ్ కేసు కూడా లేదు. దీంతో న్యూజిలాండ్లో ఆంక్షల సడలింపును ప్రకటించవచ్చని తెలుస్తోంది. న్యూజిలాండ్ నుంచి కరోనాను తరిమికొట్టినప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకుంటామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. న్యూజిలాండ్లో లాక్డౌన్ను కఠినంగా అమలు చేశారు. అత్యవసర, నిత్యవసరాలకు మాత్రమే జాగ్రత్తలు పాటిస్తూ బయటకు రావాలని చెప్పారు. న్యూజిలాండ్ ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయినప్పటికీ ఆ దేశ ప్రధాని కరోనా వైరస్ను తరిమేయడమే ముఖ్యమని భావించారు. కరోనాను అరికట్టాక మళ్లీ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిద్దామని ఆమె అన్నారు. కరోనాను జయించిన న్యూజిలాండ్ను పలు దేశాలు ప్రశంసిస్తున్నాయి.
