న్యూఢిల్లీ: పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ ఇన్స్టాగ్రామ్, ట్విటర్ దాదాపు మూడు గంటలపాటు పనిచేయలేదు. దీంతో చాలా మంది యూజర్లు ఇబ్బందిపడ్డారు. టెక్నికల్ సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు సర్వీసులు గురు, శుక్రవారాల్లో మొరాయించాయి. ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డిటెక్టర్ డాట్ కామ్ రిపోర్టు ప్రకారం ట్విట్టర్ మూడు గంటలపాటు పనిచేయకపోవడంతో దాదాపు 50 వేల మంది యూజర్లు గురువారం సాయంత్రం కంప్లైంట్స్ ఇచ్చారు. సమస్య ఉన్న మాట నిజమేనని, వెంటనే సరిచేస్తున్నామని ట్విట్టర్ ప్రకటించింది. అంతరాయానికి క్షమాపణలు చెప్పింది. ఇంటర్నల్ సిస్టమ్స్లో లోపాల వల్లే ఇలా జరిగిందని, ఇప్పుడు అంతా బాగానే నడుస్తోందని ట్వీట్ చేసింది.
ట్విట్టర్ తిరిగి పనిచేయడం మొదలైన తర్వాత, ఫోటో-షేరింగ్ ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు, దాదాపు 24 వేల మంది ఇన్స్టా పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. "కొంతమంది ఇన్స్టాగ్రామ్ను యాక్సెస్ చేయడంలో సమస్య ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు. పరిస్థితిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం" అని మెటా ప్రకటించింది. కొన్ని గంటల తరువాత ఇన్స్టా సర్వీసులు తిరిగి మొదలయ్యాయి.
