- సెంటీ మీటరు తేడాతో గోల్డ్ మెడల్ మిస్
- అండర్సన్కు స్వర్ణ పతకం
- జులియన్ వెబర్కు కాంస్యం
బ్రస్సెల్స్: ఇండియా స్టార్ జావెలియన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్లో మరోసారి రజత పతకంతో మెరిశాడు. ఎడమ చేయి విరిగినా బరిలోకి దిగిన నీరజ్ సెంటీ మీటర్ తేడాతో స్వర్ణం కోల్పోయాడు. శనివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ జావెలిన్ ఫైనల్లో నీరజ్ తన మూడో ప్రయత్నంలో అత్యుత్తమంగా ఈటెను 87.86 మీటర్ల దూరం విసిరి రెండో ప్లేస్లో నిలిచాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల దూరంతో గోల్డ్ను సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే ఈ దూరాన్ని నమోదు చేసిన పీటర్స్ ఈ సీజన్ డైమండ్ లీగ్ చాంపియన్గా అవతరించాడు.
జర్మనీకి చెందిన జులియన్ వెబర్ (85.97 మీటర్లు) కాంస్యం సాధించాడు. పీటర్స్కు డైమండ్ లీగ్ ట్రోఫీతో పాటు 30 వేల అమెరికా డాలర్లు (రూ. 25 లక్షలు), నీరజ్కు 12 వేల డాలర్ల (రూ. 10 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. ఈ టోర్నీతో 14 అంచెల డైమండ్ లీగ్తో పాటు ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ సీజన్కు ఫుల్స్టాప్ పడింది.
ఈ సీజన్లో ఒక్కటే..
పారిస్ ఒలింపిక్స్లో సిల్వర్ సాధించిన నీరజ్ ఈ ఈవెంట్లో గోల్డ్ నెగ్గి సీజన్కు ఘన ముగింపు ఇవ్వాలని ఆశించినా సక్సెస్ కాలేదు. తన ఆరు ప్రయత్నాల్లో జావెలిన్ను వరుసగా 86.82 మీ, 83.49 మీ, 87.86 మీ, 82.04 మీ, 83.30 మీ, 86.64 మీటర్ల దూరమే విసిరాడు. 2022 డైమండ్ లీగ్లో స్వర్ణంతో మెరిసిన ఇండియన్ అథ్లెట్ 2023లో సిల్వర్కే పరిమితమయ్యాడు. ఈ సీజన్లో నీరజ్ ఒక్క పావో నురుమి గేమ్స్ (జూన్ 18)లో మాత్రమే టాప్ ప్లేస్తో అలరించాడు. దోహా (మే 10), లుసానే (ఆగస్టు 22) టోర్నీల్లోనూ రెండో ప్లేస్తోనే సరిపెట్టుకున్నాడు.
గాయంతోనే బరిలోకి..
డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చేతి గాయంతోనే బరిలోకి దిగడం అతని పెర్ఫామెన్స్ను దెబ్బతీసింది. గత సోమవారం ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో నీరజ్ ఎడమ చేయి ఫ్రాక్చర్ అయ్యింది. ‘ప్రాక్టీస్ చేసేటప్పుడు నా ఎడమ చేతికి గాయమైంది. ఫ్రాక్చర్ అయినట్టు ఎక్స్ రేలో తేలింది. నొప్పిని భరించడం చాలా ఇబ్బందిగా మారింది. కానీ నా టీమ్ సాయంతో బ్రసెల్స్లో ప్రాక్టీస్ చేయగలిగా’ అని చోప్రా ఎక్స్లో పోస్ట్ చేశాడు. మామూలుగా ఈటెను విసిరిన తర్వాత పాలో త్రూలో నీరజ్ కిందపడిపోతాడు. ఈ క్రమంలో అతని ఎడమ అర చేతిని నేలకు బలంగా తాకుతుంది.
కానీ శనివారం జరిగిన ఫైనల్లో ఒక్కసారి కూడా కిందపకుండా అర చేతిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ‘ఈ సీజన్లో నాకు ఇదే చివరి పోటీ. దీనికి మంచి ముగింపు ఉండాలని కోరుకున్నా. అయినప్పటికీ నా అంచనాలను అందుకోవడంలో ఫెయిలయ్యా. ఈ సీజన్ నుంచి చాలా నేర్చుకున్నా. ఫుల్ ఫిట్నెస్తో రాబోయే టోర్నీలను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతా. ఈ ఏడాది నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ ఏడాది నన్ను మెరుగైన అథ్లెట్గా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దింది. మళ్లీ 2025లో కలుద్దాం’ అని చోప్రా పేర్కొన్నాడు.