ఫర్నిచర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడానికి ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (టీపీసీఐ) ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. తగిన రవాణా సదుపాయాలతోపాటు క్లస్టర్ పార్కులను నిర్మించడంతోపాటు ఈ రంగంలోని నేషనల్ చాంపియన్లను గుర్తించాలని సలహా ఇచ్చింది. 2024 నాటికి పది బిలియన్ డాలర్ల విలువైన ఫర్నిచర్ను ఎగుమతి చేసేలా కొనుగోలుదారులతో కలిసి ఇండస్ట్రీ పనిచేయాలని పేర్కొంది. ఫర్నిచర్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ లేదా క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు కంపెనీలకు, భూమి యజమానులకు అనుమతి ఇవ్వాలని మండలి కోరింది. ‘‘ప్లగ్ అండ్ ప్లే క్లస్టర్లకు చాలా డిమాండ్ ఉందని ఇటీవలి స్టడీ ఒకటి వెల్లడించింది. పోటీని తట్టుకోవడానికి, ఎగుమతులకు ఇవి చాలా ముఖ్యం. మనదేశంలో చాలా భూమి ఉంది. స్కిల్డ్ లేబర్ ఉన్నారు. రవాణా సదుపాయాలూ ఉన్నాయి. ఫర్నిచర్ ఇండస్ట్రీ వల్ల దేశానికి ఎంతో మేలు కలుగుతుంది. చైనా ఫర్నిచర్పై అమెరికా 25 శాతం ఇంపోర్ట్ డ్యూటీ విధించడం వల్ల ఆ దేశం నుంచి ఫర్నిచర్ ఎగుమతులు 20 శాతం తగ్గిపోయాయి. ఇండియా ఫర్నిచర్ ఎగుమతులకు ఇంపోర్ట్ డ్యూటీ లేదు. ఇది మనకు చాలా లాభాదాయకం. అమెరికాలో వ్యాపారానికి మంచి అవకాశాలు ఉన్నాయి. చాలా మందికి జాబ్స్ కూడా ఇవ్వొచ్చు’’ అని టీపీసీఐ చైర్మన్ మోహిత్ సింగ్లా అన్నారు. గ్లోబల్ ఫర్నిచర్ వ్యాపారం విలువ 250 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో యురోపియన్ యూనియన్ దేశాలు, చైనా వాటా 100 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని వెల్లడించారు. అమెరికా ఏటా 72 బిలియన్ డాలర్ల విలువైన ఫర్నిచర్ను దిగుమతి చేసుకుంటోంది. మన ఫర్నిచర్ కంపెనీలు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని సింగ్లా అన్నారు. ఇండియా కంపెనీల ఎగుమతుల విలువ 1.7 బిలియన్ డాలర్లు మించడం లేదని చెప్పారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బోధించే ఫర్నిచర్ డిజైన్ కోర్సుల్లో సీట్లను మరింత పెంచాలని కూడా సింగ్లా కోరారు.
టీపీసీఐ చేసిన మరికొన్ని సూచనలు
ఫర్నిచర్ ఫ్యాక్టరీలు ఎగుమతులకు అవసరమైన క్వాలిటీతో ప్రొడక్టులను తయారు చేస్తున్నారని నిర్ధారించడానికి ఒక రెగ్యులేటర్ను నియమించాలి. తక్కువ ఖర్చుతో ఫర్నిచర్ విడిభాగాలను ఎగుమతి చేసేలా ప్రభుత్వం సహకరించాలి. స్థానికంగా తయారయ్యే ముడిపదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉండేలా సర్టిఫికేషన్ ఇచ్చే విధానాన్ని అమలు చేయాలి. డ్రైపోర్టుల నుంచి వచ్చే ఫర్నిచర్ రవాణాకు రైల్వేలు తక్కువ చార్జీ విధించాలి.

