ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు జడ్ ప్లస్ భద్రత

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు జడ్ ప్లస్ భద్రత

తనను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై  ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ తన స్వస్థలం ఒడిశాలోని రాయ్ రంగాపూర్ శివాలయాన్ని ఆలయాన్ని సందర్శించిన ఆమె.. దర్శనానికి  ముందు చీపురుతో ఆలయాన్ని శుభ్రపరిచారు.  అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పేరు ప్రకటించగానే ముర్ముకు ఆమె బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలిపారు. ఆమెకు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఎలక్టోరల్ కాలేజ్ లో కొద్ది సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి. అయితే బిజూ జనతాదల్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. మరికొన్ని తటస్థ పార్టీలు మద్దతు ఇస్తే గెలుపు ఖాయంగానే మారింది. 

అంతకు ముందు  ద్రౌపది ముర్ము రాయ్ రంగాపూర్ లోని బ్రహ్మకుమారి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ బ్రహ్మకుమారీ సంస్థ ప్రతినిధులు ముర్మును ఘనంగా సన్మానించారు. తమ అభినందనలు తెలిపారు. రాష్ట్రపతిగా గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 



అధికార పార్టీ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న రెండో మహిళ ద్రౌపది ముర్ము. 1958 జూన్  20న ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా బైడాపోసి గ్రామంలో జన్మించిన ఈమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగా కూడా రికార్డు సాధిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి ముందు పుట్టినవారే ఉన్నారు. సంతాల్  గిరిజన తెగకు చెందిన ముర్మూ ఒడిశాలో బీజేపీ- బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. అంతకు ముందు టీచర్ గా పని చేశారు. 

తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలియడంతో చాలా సంతోషించానని ద్రౌపది ముర్ము అన్నారు. ఆదివాసీ మహిళనైన నన్ను అత్యున్నత రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడం బీజేపీ నాయకత్వానికే చెల్లిందని చెప్పారు. సబ్  కా సాథ్ , సబ్  కా వికాస్  నినాదంతో ముందుకెళ్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని పార్టీల నేతలను కలసి మద్దతు కోరుతానని అన్నారు. గవర్నర్ గా విధులు నిర్వహించిన తనకు రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవి నిర్వహించడం ఇబ్బంది కాదని చెప్పారు.