- వసైలో కొండచరియలు విరిగిపడ్డ చోట ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ
- ముంబైలో నిలిచిన లోకల్ ట్రైన్స్
ముంబై : మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. 24 గంటలుగా పడుతున్న వానకు.. నాసిక్ జిల్లాలో ఏడుగురు గల్లంతయ్యారని, ఒకరి మృతదేహం దొరికిందని అధికారులు ప్రకటించారు. పేట్, సుర్గానాతో పాటు త్రయంబకేశ్వర్ తాలుకాల్లో మంగళవారం నుంచి వర్షం కురుస్తూనే ఉందని తెలిపారు. డినోడోరీ తాలుకాలోని అల్నంది నదిని దాటుతున్న సమయంలో.. ఆరేండ్ల చిన్నారి గల్లంతయ్యిందని వివరించారు. పేట్ తాలుకాలోని మౌజీ పల్షీ ఖుర్ద్ గ్రామంలో ఓ వ్యక్తి గోదావరి నదిలో కొట్టుకుపోయాడని ప్రకటించారు. నాసిక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఇండ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సుర్గానాలోని నార్ నదిలో ఓ వ్యక్తి, శిలాపూర్ గ్రామంలోని గోదావరి నదిలో మరొకరు గల్లంతైనట్టు అధికారులు ప్రకటించారు. మరో ఘటనలో మోటార్ బైక్పై వెళ్తున్న ఇద్దరు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారన్నారు. ఒకరి మృతదేహం దొరికిందని, మరొకరి కోసం రెస్క్యూ చేస్తున్నామని తెలిపారు. త్రయంబకేశ్వర్.. మౌజే తాలేగావ్లోని కిక్వి నదిలో ఒకరు గల్లంతైనట్టు వివరించారు.
ముంబై అతలాకుతలం
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై అతలాకుతలం అవుతోంది. ముంబైతో పాటు చుట్టుపక్క ప్రాంతాలన్నీ నీట మునిగాయి. సిటీ లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. హార్బర్ లైన్లోని సబర్బన్ సర్వీసులు నెమ్మదిగా నడుస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో లోకల్ ట్రైన్ సేవలు ఆపేశామని రైల్వే అధికారులు వివరించారు. అంధేరీ సబ్వే నీట మునగడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారన్నారు. వెస్ట్రన్ఎక్స్ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యిందని వివరించారు. బోరివలీ, గోరెగాం, జోగేశ్వరీతో పాటు అంధేరీలో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయానని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
పాల్గర్లో విషాదం
కొండ చరియలు విరిగిపడి తండ్రి కూతురు చనిపోయిన ఘటన మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లా వసైలో చోటు చేసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజవళి ఏరియాలోని వగ్రల్పాడాలో అనిల్ సింగ్, తన భార్య వందన సింగ్, కూతురు రోష్ని సింగ్, కొడుకు ఓం సింగ్తో కలిసి నివాసం ఉంటున్నాడని తెలిపారు. వారు ఉంటున్న ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో అనిల్ సింగ్, రోష్ని సింగ్ చనిపోయారని వివరించారు. భార్య వందన, ఓం సింగ్లు శిథిలాల కింద ఇరుక్కుపోగా.. స్థానికులు కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు.
