అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన కొద్ది రోజులకే ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసిపై ఫత్వా జారీ అయింది . ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. రామమందిరం కార్యక్రమం జరిగిన సాయంత్రం నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తనకు వ్యక్తిగతంగా ఫత్వా జారీ అయిందన్నారు.
2024 జనవరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులకు రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు అందజేసింది. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్గా వ్యవహరించిన ఇక్బాల్ అన్సారీతో పాటు ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసికి సైతం ఆహ్వానాలు అందాయి. ఆహ్వానం అందిన రెండు రోజులు బాగా ఆలోచించి తాను అయోధ్యకు వెళ్లినట్లుగా ఇల్యాసి తెలిపారు.
నన్ను ,దేశాన్ని ప్రేమించేవారు - నాకు మద్దతు ఇస్తారు. వేడుకకు హాజరైనందుకు నన్ను ద్వేషించే వారు బహుశా పాకిస్థాన్కు వెళ్లిపోతారేమో అని తెలిపారు. తనపై కుట్ర జరుగుతుందని, తనపై ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఇల్యాసి ఆరోపించారు. మతం, కులం, విశ్వాసాలు వేర్వేరు కావచ్చు. కానీ మన అతిపెద్ద మతం మానవత్వం. నేను ఎలాంటి తప్పుచేయలేదని, కాబట్టి క్షమాపణ చెప్పే అవసరం లేదు. నాకు ఫత్వా జారీ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు.
