ప్రముఖ నటి, TMC ఎంపీ శతాబ్దిరాయ్ యూటర్న్ తీసుకున్నారు. తాను BJPలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. తాను TMCలోనే ఉంటానని స్పష్టం చేశారు. కోల్కతాలో గత సాయంత్రం డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీతో గంటపాటు జరిగిన సమావేశం తర్వాత శతాబ్దిరాయ్ ఈ ప్రకటన చేశారు. అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చింది మమతా బెనర్జీ కోసమేనని…ఆమెతోనే ఉంటానన్నారు.
బిర్భూమ్ ఎంపీ శతాబ్దిరాయ్ ఇవాళ(శనివారం) ఉదయం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి అమిత్ షాను కలుస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ఢిల్లీ పర్యటనను తాను రద్దు చేసుకున్నట్టు గత సాయంత్రం తెలిపారు. ఆమె ప్రకటనతో TMC నేతలు ఊపిరి పీల్చుకున్నారు. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో TMC నేతలు బీజేపీలో చేరుతుండడంతో రాష్ట్రంలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలోనే శతాబ్దిరాయ్ కూడా బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ పుకార్లకు చెక్ పెడుతూ ఆమె క్లారిటీ ఇచ్చారు.
