హెల్త్ బీమా చాలా ముఖ్యమనే సంగతి కరోనా తరువాత చాలా మందికి అర్థమైంది. దీంతో పాలసీలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ల విషయానికి వచ్చే సరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాలసీహోల్డర్లు తెలిసో తెలియకో తప్పులు చేయడం మామూలే అయినా బీమా కంపెనీల నుంచి తప్పులు దొర్లుతున్నాయనే ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి. కంపెనీలు తమ తీరును మార్చుకోవాలంటూ అంబుడ్స్మన్ రిపోర్టు మందలించింది.
న్యూఢిల్లీ: కరోనా పుణ్యమాని గత ఏడాదిన్నర కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ చాలా డెవెలప్ అయింది. పాలసీల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు పెడుతున్న కఠినమైన రూల్స్ వల్ల పాలసీహోల్డర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ ఇయర్ రిపోర్టు 2020–-21’ పాలసీహోల్డర్లు ఎందుకు అసంతృప్తికి గురవుతున్నారో.. ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో కళ్లకు కట్టింది. కంపెనీలకు చీవాట్లు పెట్టింది. బీమా సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దిద్దుబాటు చర్యల గురించి వివరించింది.
వివరాలు లేటైనా క్లెయిమ్ రిజెక్షన్
ఆస్పత్రిలో చేరిన విషయాన్ని ఆలస్యంగా తెలియజేశారనే కారణంతో క్లెయిమ్లను తిరస్కరించవద్దని బీమా సంస్థలను ఐఆర్డీఏ ఇది వరకే కోరింది. ఇట్లాంటి చిన్న కారణాలతో క్లెయిమ్ను తిరస్కరించడం సరికాదని, ఈ పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేసింది. బీమా అంబుడ్స్మన్ రిపోర్టు ఈ విషయాన్ని హైలైట్ చేసింది. ఐఆర్డీఏ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని బీమా సంస్థలకు సూచించింది.
రిన్యువల్ సమయంలో పాలసీ రూల్స్లో మార్పు
ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ రిన్యువల్ సమయంలో రూల్స్ను పూర్తిగా మార్చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. కొన్నిసార్లు పాత రూల్స్ అన్నీ తీసేసి కొత్తవాటిపై సంతకాలు చేయించుకుంటున్నారు. నిజానికి అవి కొత్త ప్రొడక్టులనే ఫిర్యాదులూ ఉన్నాయి. సీనియర్ సిటిజన్లు ఆఫీసుల చుట్టూ తిరగలేరు కాబట్టి మరొక బీమా సంస్థకు వెళ్లడం కష్టం. షరతులను అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదు. అంబుడ్స్మన్ రిపోర్టు కూడా ఈ సవాలుకు ఎలాంటి పరిష్కారమూ చూపలేదు. రిన్యువల్ సమయంలో పాలసీ షెడ్యూల్లోని మొదటి పేజీలోనే కొత్త మార్పులను హైలైట్ చేయాలని సిఫార్సు చేసింది.
నిర్ణయాన్ని టీపీఏలకు వదిలివేస్తున్నాయ్
క్లెయిమ్పై నిర్ణయం తీసుకోవాల్సింది బీమా సంస్థ అని, థర్డ్ -పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) కాదని ఐఆర్డీఏ స్పష్టం చేసింది. అయినప్పటికీ, చాలా కంపెనీలు టీపీఏలు తిరస్కరించిన క్లెయిమ్లను మరోసారి సమీక్షించే విధానాన్ని తేవడం లేదు. టీపీఏ క్లెయిమ్ను రిజెక్షన్ చేసిన తర్వాత ఫిర్యాదుదారుడు బీమా కంపెనీ గ్రీవెన్స్ సెల్ను సంప్రదించినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. కంప్లైంట్లపై తగిన రీతిలో స్పందించకుండా ‘ఆటోమేటెడ్’ రిప్లైలు పంపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో, అంబుడ్స్మన్ ముందు కేసులను సమర్పించడానికి బీమా సంస్థ టీపీఏపై వివరాలపై ఆధారపడుతోంది.
పదాలు అర్థం కావట్లే..
బీమా కాగితాల్లో పదాలు చాలా మందికి అర్థం కావడం లేదు. అందరికీ అర్థమయ్యేలా పాలసీకాగితాలను తయారు చేయాలి. నిజానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) ఎజెండాలో చాలా కాలంగా ఈ ప్రపోజల్ ఉంది. అయినప్పటికీ పాలసీ క్లాజులు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ‘ప్రపోర్షనేట్ డిడక్షన్, సమ్ ఎష్యూర్డ్ ఎన్హాన్స్మెంట్, యాక్టివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, కస్టమరీ, రీజనబుల్ చార్జెస్’ వంటి పదాలకు సరైన వివరణ అవసరం. ఇవి అర్థం కాకపోవడంతో కస్టమర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఇవి కొన్నిసార్లు కోర్టు కేసుల వరకు వెళ్తున్నాయి.
