భద్రాచలం, వెలుగు: తెలంగాణ – చత్తీస్గఢ్ బార్డర్ లో మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లా కొండపల్లి ఏరియాలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆదివాసీలతో ర్యాలీ నిర్వహించి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమరవీరులకు నివాళి అర్పిస్తూ .. వారు ఆలపించిన గీతాలు పలువురిని కంటతడి పెట్టించాయి. బేస్ క్యాంపులతో నిత్యం కూంబింగ్లు నిర్వహిస్తున్న భద్రతా బలగాలను దాటుకుని ఆదివాసీలు సంబురాలకు తరలివెళ్లడం విశేషం. ఇటీవలే అబూజ్మాడ్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు చనిపోయినా, ఏ మాత్రం తమ కార్యకలాపాలను తగ్గించుకోకుండా వార్షికోత్సవాలు జరుపుకోవడం గమనార్హం.
ఆదివాసీ హక్కులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయంటూ ర్యాలీల్లో నినాదాలు చేశారు. మాడ్ను కాపాడుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. గత నెల 21 నుంచి ఈనెల 20వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవాల నిర్వహణకు మావోయిస్టులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా.. దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 38 మంది మావోయిస్టులు మృతిచెందారని బస్తర్ఐజీ సుందర్ రాజ్ పి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత 31 మంది చనిపోయినట్లుగా గుర్తించారు. కానీ గాయపడిన మరికొందరిలో 7 మంది కూడా మృతి చెందినట్లు, వారి పేర్లను కూడా బస్తర్ పోలీసులు గుర్తించి వెల్లడించారు. వీరిపై రూ.2.62కోట్ల రివార్డు ఉన్నట్లు ఐజీ తెలిపారు.