ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న శతాబ్ధి ఎక్స్ప్రెస్లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హరిద్వార్లోని రాజాజీ పులుల సంరక్షణ కేంద్రం దగ్గర షార్ట్ సర్క్యూట్ కారణంగా సీ-4 బోగీలో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. దీంతో వెంటనే ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేసినట్లు సమాచారం. మంటల కారణంగా సీ-4 బోగీ మొత్తం కాలి బూడిదైంది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. బోగీని ఇంజన్ నుంచి వేరు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని... అందరూ క్షేమంగా ఉన్నారని ఉత్తరాఖండ్ డీజీపీ తెలిపారు. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ దర్యాప్తు జరుపుతోందన్నారు. ప్రయాణికులను ఇతర బోగీల్లో అడ్జస్ట్ చేసి...ఆ తర్వాత రైలు బయలువేరి డెహ్రాడూన్ వెళ్లింది.
