సూట్‌కేస్‌లో కంగారును పట్టుకొచ్చాడు.. ప్రయాణికుడు అరెస్ట్

 సూట్‌కేస్‌లో కంగారును పట్టుకొచ్చాడు..  ప్రయాణికుడు అరెస్ట్

అంతరించిపోతున్న 234 వన్యప్రాణులను బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని బెంగళూరు ఎయిర్ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. 2023 ఆగస్టు 21, సోమవారం రాత్రి అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి ఎఫ్ డీ-137 నంబర్ విమానంలో రాత్రి దేవనహళ్లి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడు దిగాడు.   విమానాశ్రయం అరైవల్ ఏరియా డిపార్చర్ గేట్ వైపు ప్రయాణీకుడు వెళుతుండగా, బెంగళూరు ఎయిర్ కస్టమ్స్ అధికారులు అతన్ని ఆపి తనిఖీ చేశారు. 

ప్రయాణికుడి సామాను సోదాల్లో రెండు ట్రాలీ బ్యాగుల్లో వన్యప్రాణులను తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. తనిఖీలో కొండచిలువలు, ఊసరవెల్లులు, ఇగువానాలు, తాబేళ్లు, ఎలిగేటర్లు, కంగారు పిల్లతో సహా మొత్తం 234 వన్యప్రాణులు కనిపించాయని బెంగళూరు ఎయిర్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. అయితే ఇందులో కంగారు పిల్ల ఊపిరాడాక చనిపోయింది.   ప్రయాణికుడిని కస్టమ్స్ చట్టం,1962 సెక్షన్ 104 కింద అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా సరీసృపాలను థాయ్‌లాండ్‌కు తిరిగి పంపించారు. 

తాజాగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 18న దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానం నంబర్ 568లో ఓ ప్రయాణికుడు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దుబాయ్ నుంచి విమానంలో దిగిన ఓ ప్రయాణికుడు తన లగేజీ బ్యాగ్‌లో బంగారు నట్ బోల్ట్‌ను స్మగ్లింగ్ చేస్తున్నాడు.అనంతరం బెంగళూరు కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని 267 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.