ముంబై: మహారాష్ట్ర బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)లోని ఓ ఉద్యోగి పేరుతో ఇంకో వ్యక్తి కూడా జాబ్లో చేరాడు. 24 ఏళ్లు అందరినీ నమ్మించాడు. మొత్తం రూ.43.31లక్షల జీతం కూడా తీసుకున్నాడు. కానీ 2017లో అసలు విషయం అధికారులకు తెలిసింది. ఎంక్వైరీ చేసి చీటింగ్ జరిగిందని గుర్తించి కేసు పెట్టిన్రు. సోపన్ మారుతి సబలే అనే వ్యక్తి బీఎంసీ ఉద్యోగి. 1989లో బీఎంసీలో ఎఫ్ సౌత్ వార్డులో బిల్డింగ్ ముకదమ్గా పనిలో చేరాడు. ఈయన పేరు, పుట్టిన రోజు, స్కూల్ సర్టిఫికెట్ ఒకేలా ఉన్న మరో వ్యక్తి 1993లో బీఎంసీలో చేరాడు. బైకల్లాలోని వాటర్ డిపార్ట్మెంట్లో గార్డెనర్గా అపాయింట్ అయ్యాడు. 2017 వరకూ ఈ చీటింగ్ చేసిన వ్యక్తి గురించి ఎవరికీ తెలియలేదు. 2017లో బీఎంసీలో ఇద్దరు ఉద్యోగుల వివరాలు ఒకేలా ఉన్నాయని గుర్తించి అధికారులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇద్దరినీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని ఆదేశించారు. అసలైన వ్యక్తి సర్టిఫికెట్లన్నింటినీ ఇవ్వగా నకిలీ వ్యక్తి పనికి రావడం మానేశాడు. పూర్తిగా దర్యాప్తు చేసిన అధికారులు చీటింగ్ జరిగిందని గుర్తించి ఈమధ్యనే నకిలీ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
