ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి అస్వస్థతకు లోనయ్యారు.దీంతో ఆయనను రాంచీలోని రాజేంద్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ.. ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు తెలిపారు .అంతేకాదు.. ఆయన బ్లడ్ షుగర్,రక్తపోటు హెచ్చుతగ్గులున్నాయని చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు రిమ్స్ ఏడుగురు డాక్టర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. లాలూ మూత్రపిండాలతో పాటు పలు వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయనకు కిడ్నీల వ్యాధి స్టేజీ-4లో ఉండగా.. 20శాతం సామర్థ్యతో మాత్రమే పని చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు డాక్టర్ విద్యాపతి తెలిపారు.
దాణా కుంభకోణం కేసులో లాలూకు రాంచీ ప్రత్యేక సీబీఐ కోర్టు ఇవాళ(సోమవారం) ఐదేళ్ల జైలుశిక్ష విధించడంతో పాటు.. రూ.60లక్షల జరిమానా విధించింది. ఈ నెల 15న ఈ కేసులో దోషిగా తేల్చగా.. ఇవాళ శిక్ష ఖరారు చేసింది.ఈ కేసులో మరో 46 మందికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 24 మందిని నిర్ధోషులుగా తేల్చింది.
