సమావేశానికి డేట్లు చెప్పాలని సూచన
సంక్రాంతికి ముందే త్రిసభ్య కమిటీ మీటింగ్
నీటి అవసరాలు, వాడుకున్న నీటి లెక్కలు చెప్పాలని సూచన
హైదరాబాద్, వెలుగు: సంక్రాంతికి ముందే త్రీమెన్ కమిటీ మీటింగ్ నిర్వహించేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సిద్ధమవుతోంది. ఈ మేరకు జనవరిలో సమావేశానికి అనువైన డేట్లు చెప్పాల్సిందిగా తెలంగాణ, ఏపీలకు బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురే గురువారం లేఖ రాశారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు రెండు రాష్ట్రాలకు అవసరమైన వాటర్ ఇండెంట్స్ను సమర్పించాలని కోరారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు ఉపయోగించుకున్న నీటి లెక్కలను జనవరి 8 నాటికి పంపించాలని సూచించారు. రెండు రాష్ట్రాల ఈఎన్సీలు జనవరి పదో తేదీకి ఒకటి, రెండు రోజుల తర్వాత త్రీమెన్ కమిటీ సమావేశానికి ఒప్పుకుంటే సంక్రాంతిలోపే సమావేశం నిర్వహిస్తామని, లేనిపక్షంలో పండుగ తర్వాత మీటింగ్ ఉంటుందని బోర్డు అధికారులు తెలిపారు.
ఏపీని కట్టడి చేయండి!
నిరుడు ఉపయోగించుకోలేకపోయిన 51.21 టీఎంసీల నీటిని ఈ వాటర్ ఇయర్లో వాడుకునేందుకు అవకాశమివ్వాల్సిందిగా త్రీమెన్ కమిటీ మీటింగ్లో తెలంగాణ కోరనుంది. ఏపీ నిరుడు ఎక్కువ తీసుకున్న 9 టీఎంసీల నీటిని ఈ ఏడాది ఆ రాష్ట్ర కోటా నుంచి మినహాయించాలని ఇదివరకే బోర్డుకు లేఖ రాసింది. ఏపీ వరద రోజుల్లో తీసుకున్న నీటిని ఎకౌంట్లో లెక్కించొద్దన్న ఏపీ లేఖపైనా అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో జనవరిలో నిర్వహించబోయే త్రీమెన్ కమిటీ సమావేశం కీలకం కానుంది.
