- వరల్డ్ విమెన్స్ ర్యాపిడ్ చెస్ చాంపియన్గా ఇండియా లెజెండ్
- మెగా టోర్నీలో రెండో స్వర్ణంతో తెలుగు మహిళ కొత్త చరిత్ర
న్యూయార్క్: ఇండియా చెస్ దిగ్గజం, తెలుగు తేజం కోనేరు హంపి కొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ విమెన్స్ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో రెండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మెగా టోర్నీ ఆఖరి రౌండ్లో ఇండోనేసియా ఇంటర్నేషనల్ మాస్టర్ ఇరెన్ సుకందర్ను ఓడించిన హంపి 11 రౌండ్లకు గాను అందరికంటే ఎక్కువగా 8.5 పాయింట్లు సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది. 2019లో తొలిసారి వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్గా నిలిచిన హంపి ఐదేండ్ల విరామం తర్వాత మరోసారి స్వర్ణం సాధించింది. దాంతో ఈ టోర్నీలో రెండుసార్లు టైటిల్ నెగ్గిన తొలి ఇండియన్గా... ఓవరాల్గా రెండో ప్లేయర్గా రికార్డు సృష్టించింది. హంపి కంటే ముందు చైనా జీఎం జు వెంజున్ రెండుసార్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. రెండు స్వర్ణాలతో చరిత్రకెక్కిన హంపిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. కాగా, ఈ టోర్నీలో బ్లిట్జ్ చాంపియన్షిప్ పోటీలు సోమ, మంగళవారాల్లో జరుగతాయి. ఓపెన్ బ్లిట్జ్లో 13 రౌండ్లు, విమెన్స్లో 11 రౌండ్లు ఉంటాయి. వీటిలో అత్యధిక పాయింట్లు సాధించిన ఎనిమిది మంది నాకౌట్ రౌండ్కు అర్హత సాధిస్తారు.
ఓటమితో ఆరంభించి.. విజయంతో ముగించి
ఈ టోర్నీని ఓటమితో ఆరంభించిన ఇండియా జీఎం హంపి ఆ తర్వాత అద్భుత ఆటతో సత్తా చాటింది. తొలి రోజు నాలుగు గేమ్స్లో 2.5 పాయింట్లు రాబట్టిన ఆమె రెండో రోజు హారిక, జు వెంజున్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇక, చివరి, 11వ రౌండ్కు ముందు ఏడుగురు ప్లేయర్లు సమాన పాయింట్లతో నిలిచారు. కానీ, ఈ రౌండ్లో హంపి మాత్రమే విజయం సాధించింది. నల్లపావులతో ఆడినప్పటికీ ఎండ్ గేమ్లో తనదైన శైలిలో ఎత్తులు వేసి ఇరెన్ను ఓడించింది. దాంతో 8.5 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. ఇండియాకే చెందిన ద్రోణవల్లి హారిక సహా ఆరుగురు ప్లేయర్లు 8 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. టేబుల్ స్కోరు తర్వాత హారిక చివరకు ఐదో స్థానంతో సరిపెట్టింది. ఇండియాకే చెందిన దివ్యా దేశ్ముఖ్ (7) 21వ, పద్మిని రౌత్ (6.5) 26వ , ఆర్. వైశాలి (5.5) 52వ, వంతికా అగర్వాల్ (5) 67వ స్థానాలతో సరిపెట్టారు.
అర్జున్కు నిరాశ
ఓపెన్ సెక్షన్లో టైటిల్పై ఆశలు రేపిన తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ 13 రౌండ్లలో 9 పాయింట్లతో ఇండియా నుంచి అత్యుత్తమంగా ఐదో స్థానంతో సంతృప్తి చెందాడు. సంయుక్త ఆధిక్యంతో చివరి రోజు పోటీకి వచ్చిన అర్జున్ పదో రౌండ్లో అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా) చేతిలో ఓడిపోవడం అతని అవకాశాలను దెబ్బ తీసింది. 11వ రౌండ్లో గెలిచినా చివరి రెండు గేమ్లను డ్రా చేసుకోవడంతో ఐదో ప్లేస్తో సరిపెట్టాడు. రష్యాకు చెందిన 18 ఏండ్ల వొలోడార్ ముర్జిన్ అత్యధికంగా 10 పాయింట్లతో విజేతగా నిలిచాడు. 12వ రౌండ్లో ఇండియా జీఎం ఆర్. ప్రజ్ఞానందపై గెలిచి అగ్రస్థానంలోకి వచ్చాడు. అలెగ్జాండర్ గ్రిషుక్, ఇయాన్ నెపోమ్నియాచి చెరో 9.5 పాయింట్లతో వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ప్రజ్ఞానంద (8.5) 17వ స్థానం సాధించగా.. అరవింద్ చిదంబరం (8), వి. ప్రణవ్ (7.5), రౌనక్ సాధ్వాని (7) వరుసగా 40, 44, 55వ స్థానాల్లో నిలిచారు.
రిటైర్ అవ్వాలని అనుకున్నా...
ఈ టోర్నీలో మరోసారి గోల్డ్ నెగ్గినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా. తొలి గేమ్లో ఓడిన తర్వాత టైటిల్ గురించి ఆలోచించలేదు. పైగా ఈ ఏడాది చాలా టోర్నీల్లో నిరాశ పరిచాను. రెండింటిలో ఆఖరి ప్లేస్లో నిలవడంతో ఆటను కొనసాగించాలా.. రిటైర్ అవ్వాలా? అన్న ఆలోచన కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో వచ్చిన విజయం నాకెంతో చాలా ప్రత్యేకం. నేను తిరిగి పోరాడటానికి, చెస్ను కొనసాగించడానికి అవసరమైన ఉత్సాహాన్ని అందించింది. నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందని భావిస్తున్నా. నా భర్త, తల్లిదండ్రులు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. టోర్నీల కోసం నేను ప్రయాణం చేసేటప్పుడు మా అమ్మాయిని అమ్మానాన్నలే చూసుకుంటున్నారు. 37 ఏండ్ల వయసులో వరల్డ్ చాంపియన్గా నిలవడం అంత సులభం కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రేరణను కొనసాగించడం, మెదడును పదునుగా ఉంచుకోవడం చాలా కష్టం. ఈ మధ్యే గుకేశ్ వరల్డ్ చాంపియన్ అయ్యాడు. ఇప్పుడు నేను ర్యాపిడ్ లో రెండోసారి వరల్డ్ టైటిల్ నెగ్గాను. ఇది మన దేశ చెస్లో అత్యుత్తమ దశ అనొచ్చు. ఈ విజయం దేశంలోని యువతను ప్రొఫెషనల్ చెస్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నా.
37 ఏండ్ల వయసు మహిళ. ఏడేండ్ల బిడ్డకు తల్లి. ఏడాదిగా ఒక్క విజయం కూడా లేదు. ఎక్కడ బరిలోకి దిగినా ప్రతికూల ఫలితాలే. ఇలాంటి పరిస్థితుల్లో విమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో బరిలోకి దిగిన ఇండియా దిగ్గజం కోనేరు హంపి అద్భుతం చేసింది. తొలి రౌండ్లోనే ఓడినా.. అసాధారణ ఆటతో ముందుకొస్తూ స్వర్ణం గెలిచింది. ప్రతిష్టాత్మక టోర్నీలో రెండోసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ మధ్యే దొమ్మరాజు గుకేశ్ 18 ఏండ్లకే వరల్డ్ చెస్ చాంపియన్గా నిలవడం.. చెస్ ఒలింపియాడ్లో మన పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు నెగ్గడంతో ఈ ఏడాది ఇండియన్ చెస్ కొత్త శిఖరాలకు చేరుకుంటే.. ఇప్పుడు అమెరికా గడ్డపై హంపి తన అద్వితీయ విజయంతో 2024కు గోల్డెన్
ఫినిషింగ్ ఇచ్చింది.