గణేషుడిని తొమ్మిది రోజులు పూజించిన తరువాత నిమజ్జనం చేస్తారు. మేళ తాళాలతో ఊరేగింపుగా భారీ ప్రదర్శనతో గణేషుడికి వీడ్కోలు చెబుతూ గణపతి బొప్ప మోరియా అంటూ చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. అయితే మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో వినాయక నిమజ్జనాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయకుడిని తొమ్మిది రోజులు పూజించి పదవరోజున చెరువులు, కుంటలు, నదుల్లో నిమజ్జనం చేస్తుంటారు. అయితే నిమజ్జన సమయంలో పలు చోట్ల కొన్ని అపశృతులు చోటు చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇక ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు కొల్హాపూర్ అధికారులు నూతన టెక్నాలజీని రూపొందించారు.
ఓ కన్వేయర్ బెల్ట్ ఉపయోగించి నిమజ్జనాన్ని పూర్తి చేశారు. చెరువులోకి వెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేయాల్సిన అవసరం లేకుండా భక్తులు ఈ కన్వేయర్ బెల్ట్ ఉపయోగించారు. ఆ బెల్ట్ పై ఒక్కక్కటిగా విగ్రహాలను పెట్టడం ద్వారా నెమ్మదిగా అవన్నీ చెరువులో కలిసిపోయాయి. నిమజ్జనం ఈజీగా పూర్తయింది. ఈ విధానం ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
ఈ వీడియోను ఒక మిలియన్ మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. కొందరు ఈ విధానాన్ని తప్పుబడుతున్నారు. సాంప్రదాయబద్దంగా నీటిలోకి నేరుగా వెళ్లడం ద్వారా నిమజ్జనం చేయడమే సరైన విధానమని కొంతమంది భక్తులు భావిస్తున్నారు గణపతి భగవానుడినికి వీడ్కోలు పలికేటప్పుడు గణపతి బొప్పా మోరియా అంటూ నీటిలో స్వయంగా నిమజ్జనం చేయాలని రాశారు.. మరికొంత మంది హిందూ సంస్కృతిని అవమానపర్చడమేనని సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని తెలిపారు. కొంతమంది హైటెక్ గణేశ నిమజ్జనమని .. నేరుగా నీటిలోకి వెళితే జరిగే ఘటనలకు ఈ పద్దతి ద్వారా చెక్ పెట్టవచ్చన్నారు.
ప్రత్యేకమైన వినాయక ప్రతిమలు తయారు చేయడం ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అదే విధంగా నిమజ్జనం చేసే సమయంలో కూడా వివిధ నగరాలు తమ ప్రత్యేకను చాటుకుంటున్నాయి.
