శబరిమల ఆలయంలోకి 9 ఏళ్ల బాలికకు అనుమతి

శబరిమల ఆలయంలోకి 9 ఏళ్ల బాలికకు అనుమతి

శబరిమల దేవాలయానికి తండ్రితోపాటు వెళ్లడానికి  పర్మిషన్ కోరుతూ  9 ఏళ్ల బాలిక కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఆ బాలికను ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది. 10 ఏళ్లు నిండేలోపు ఆలయం చూడాలని కోరుకుంటోందని బాలిక తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ అవకాశం పోతే ఆమె మళ్లీ ఆలయం చూడాలంటే మరో నలభై ఏళ్ల వరకూ ఆమెకు అవకాశం దక్కదని ఆయన వాదించారు.

ఈ వాదనలు విన్న కేరళ హైకోర్టు ఆగస్టు 23న ఆ బాలికను తండ్రితోపాటు ఆలయంలోకి అనుమతించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ నెలలో కూడా కోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న పెద్దలు పాల్గొనే అన్ని కార్యక్రమాల్లోనూ పిల్లలను అనుమతించాలని అప్పట్లో చెప్పింది.  దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక తీర్మానం చేసింది.

ఏటా నిర్వహించే నిరపుతారి వేడుక కోసం అయ్యప్ప ఆలయ ద్వారాలు ఆగస్టు 15న తెరుచుకున్నాయి. కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకొని రోజుకు 15 వేల మంది భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఆ సంఖ్య పూర్తయిన వెంటనే ఆలయాన్ని మూసివేస్తున్నారు. ఆగస్టు 23 సాయంత్రం పూజలు పూర్తయిపోతాయి.