కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు విమాన ప్రయాణంలో ఊహించని సంఘటన ఎదురైంది. యూత్ కాంగ్రెస్కు చెందిన ఇద్దరు కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్.. ఇద్దరు నిరసనకారులను వెనక్కి నెట్టేశారు. వారు నినాదాలు చేస్తుండగా జయరాజన్ వారిని తోసేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన కేరళలోని కన్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్లే విమానంలో జరిగింది.
విమానంలో నిరసనలు చేపట్టిన యూత్ కాంగ్రెస్ మట్టన్నుర్ బ్లాక్ అధ్యక్షుడు ఫర్సిన్ మజీద్, కన్నూర్ జిల్లా సెక్రెటరీ ఆర్కే నవీన్ కుమార్ను.. కన్నూర్ విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. తాము వైద్యం కోసం తిరువనంతపురం వెళ్తున్నామని చెప్పడంతో అనుమతించినట్లు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కార్యకర్తల పట్ల ఈపీ జయరాజన్ దురుసుగా ప్రవర్తించారని, వారిపై చేయి చేసుకున్నారని యూత్ కాంగ్రెస్ ఆరోపించింది. కొద్ది రోజుల క్రితం బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్పై నిందితురాలు స్వప్న సురేశ్ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో విపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి.
