- తిరుమల వివాదం నేపథ్యంలో కర్నాటక సర్కారు కీలక నిర్ణయం
బెంగళూరు : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో కర్నాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ రాష్ట్రంలోని దేవాలయ బోర్డు పరిధిలోని 34వేల ఆలయాల్లో తప్పనిసరిగా కర్నాటక మిల్క్ఫెడరేషన్ (కేఎంఎఫ్) ఉత్పత్తి చేసే నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆలయాల్లో వెలిగించే దీపాలు, ప్రసాదం తయారీ, ఇతర ఆచారాల కోసం నందిని నెయ్యిని మాత్రమే వాడాలని పేర్కొన్నది.
‘‘రాష్ట్రంలోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నోటిఫై చేసిన అన్ని ఆలయాల్లో సేవలు, దీపాలు, అన్ని రకాల ప్రసాదాల తయారీ, దాసోహ భవన్లో క్రతువులకు నందిని నెయ్యిని వాడాలి. ఆలయాల్లో తయారు చేసే ప్రసాదాల నాణ్యతను కొనసాగించాలి” అని వెల్లడించింది. భక్తులకు అందించే అన్నదానం, ప్రసాదం నాణ్యతలో రాజీపడొద్దని ఆలయాల సిబ్బందికి సూచించింది.