బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్నాటక హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఎంపీగా ప్రజ్వల్ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం తీర్పు వెల్లడించింది. అంతేగాక, వచ్చే ఆరేండ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో ప్రజ్వల్ పోటీ చేయకుండా అనర్హత విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో ఆయన తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినట్లు రుజువైందని తెలిపింది.
2019 లోక్ సభ ఎన్నికల్లో హసన్ స్థానం నుంచి ప్రజ్వల్ ఎంపీగా గెలుపొందారు. అయితే, ఎన్నికల సందర్భంగా ఆయన తప్పుడు వివరాలతో అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ హసన్ కు చెందిన ఓటర్ జి. దేవరాజేగౌడ, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎ.మంజు పిటిషన్లు దాఖలు చేయగా, తాజాగా తీర్పు వచ్చింది.
