న్యూఢిల్లీ: మార్క్ జుకర్బర్గ్కు చెందిన మెటా, రిలయన్స్కు చెందిన జియోలు..మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్, జియోమార్ట్ల ఇంటిగ్రేషన్ను పూర్తి చేశాయి. తాజా ప్రకటన ప్రకారం జియోమార్ట్ సేవలు భారతదేశం అంతటా వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి. నేరుగా ఆర్డర్లను బుక్ చేసుకోవడానికి, డబ్బు చెల్లించడానికి వాట్సాప్ ఉపయోగపడుతుంది. ఈ రెండు కంపెనీలు పోయిన డిసెంబర్లో గ్రాసరీ ప్రాజెక్ట్ కోసం పైలట్ దశను చేపట్టాయి.
సోమవారం జరిగిన జియో వార్షిక సాధారణ సమావేశం తర్వాత జుకర్బర్గ్ పూర్తి రోల్ అవుట్ను ప్రకటించారు. ఆన్లైన్ కిరాణా డెలివరీ ప్లాట్ఫారమ్ జియోమార్ట్ను ముకేశ్ అంబానీ చిన్న కొడుకు ఆకాష్ అంబానీ నిర్వహిస్తారు. వాట్సాప్ అనేది మెటా ప్లాట్ఫారమ్కు (గతంలో ఫేస్బుక్) చెందిన ఇన్స్టంట్ మెసేజ్ యాప్. పోయిన సంవత్సరం నుండి తన వాట్సాప్ బిజినెస్ ప్లాట్ఫారమ్ను నడుపుతోంది. 2020 ఏప్రిల్ లో జియో ప్లాట్ఫారమ్లలో 9.99శాతం వాటాను రూ.43,574 కోట్లకు ఫేస్బుక్ తీసుకున్నప్పటి నుండి రెండు ప్లాట్ఫారమ్ల మధ్య ఇంటిగ్రేషన్ జరుగుతోంది.
జియోమార్ట్ తన మొదటి డెమో రోల్అవుట్ను 2020 ఏప్రిల్ లో వాట్సాప్లో ప్రారంభించింది. మహారాష్ట్రలోని నవీ ముంబై, ఠాణే, కళ్యాణ్ జిల్లాల్లో యాప్లో చాట్- ఆధారిత ఇంటర్ఫేస్ ద్వారా తన సేవలను అందించింది. ఈ యాప్కు భారతదేశంలో 487 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు.
