అమరావతి: గత ప్రభుత్వ అవినీతి బాగోతాలపై కేబినెట్ సబ్కమిటీని నియమించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. 30 అంశాలపై విచారణ చేస్తామని సీఎం చెప్పారు. ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ సంస్థల సహకారం తీసుకుని గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను, అవినీతిని బయటపెడతామని చెప్పారు.
విద్యుత్రంగ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ ఈ కామెంట్స్ చేశారు. కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై దృష్టి పెడతామన్నారు. సోలావర్, విండ్ పవర్ కొనుగోళ్లపై చర్చించారు. కాంపిటేటివ్ బిడ్డింగ్ రేట్లకన్నా అధిక రేట్లకు సోలార్, విండ్ పవర్ ను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు సీఎం.
ప్రభుత్వ ఖజానాకు రూ.2,636 కోట్లు నష్టం వాటిల్లిందని రివ్యూలో తేల్చారు అధికారులు. ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం ఆదేశించారు. కంపెనీలతో మళ్లీ సంప్రదింపులు చేయడానికి ఒక మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేశారు. సోలార్, విండ్ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలని సూచించారు. సోలార్, విండ్ కంపెనీల్లో ఒప్పందాల్లో భారీ దోపిడీ స్పష్టం కావడంతో… ఈ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి మంత్రి, అప్పటి ముఖ్యమంత్రిపైనా న్యాయపరమైన చర్యలకు ఆదేశాలు జారీచేశారు సీఎం జగన్.
