ఐపీఎల్ పన్నెండో సీజన్ ఫైనల్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకున్న హైదరాబాద్ ఆనందం ఆవిరయ్యే ప్రమాదం కనిపిస్తోంది. భాగ్యనగరానికి ఫైనల్ను కేటాయిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఉప్పల్ స్టేడియంలోని సౌత్ స్టాండ్ పైకప్పు(కనోపి) ధ్వంసమైంది. సోమవారం రాత్రి భయంకరమైన ఈదురు గాలుల దెబ్బకు కనోపిలోని చాలా భాగం కొట్టుకు పోయింది. సౌత్ పెవిలియన్ గ్రౌండ్ ఫ్లోర్ లోని వీఐపీ గ్యాలరీకూడా పాక్షికంగా దెబ్బతిన్నది. గ్లాస్ డోర్లు కిందపడ్డాయి. సోమవారం మ్యాచ్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో వచ్చేనెల 12వ తేదీన ఫైనల్ ఈ స్టేడియంలోనే జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నెల 29న పంజాబ్ తో సన్ రైజర్స్ చివరి హోమ్ మ్యాచ్ కూడా ఆడనుంది. కోట్లల్లో ఖర్చవడం, సమయం తక్కువగా ఉండడంతో ఈ ఐదు రోజుల్లో గానీ.. ఫైనల్ టైమ్ కు గానీ కనోపిని ఏర్పాటు చేయడం కష్టమే అనిపిస్తోంది. 2012లో రూ. 21 కోట్లతో సౌత్ , నార్త్ స్టాండ్లపై పైకప్పు ఏర్పాటు చేశారు. అయితే, అందోళన చెందాల్సి న అవసరం లేదని, ఫైనల్ ఉప్పల్ లోనే జరుగుతుందని హెచ్ సీఏ సీఈవో పాండురంగమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.‘ఈదురు గాలులకు సౌత్ పెవిలియన్ కనోపిషీట్లు కొట్టుకు పోయాయి. దీన్ని ఏర్పాటు చేసిన కంపెనీ నిపుణులను పిలిపించాం. తాత్కాలిక మరమ్మతులు చేస్తే సరిపోతుందా లేదా అన్నదివాళ్లే తేల్చాల్సి ఉంది. కనోపికి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి రిపేర్ కు ఎంత ఖర్చైనా ఇబ్బంది ఉండదు. ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు కూడా కనోపిని పరిశీలించారు. వాళ్లు రిపోర్టు ఇచ్చాక తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తాం. అయితే, ఈనెల 29న చివరి మ్యాచ్ , మే 12న ఫైనల్ మ్యాచ్ నిర్వహణకు కనోపి డ్యామేజ్ పెద్ద సమస్య కాబోదు . ఎందుకంటే రెండు మ్యాచ్ లు రాత్రిపూటే జరుగుతాయి. అయితే, ఈ ఘటనపై బీసీసీఐకి రిపోర్టు పంపిస్తున్నా. బోర్డు ప్రతినిధులు స్టేడియం పరిశీలనకు వచ్చే అవకాశం లేదనుకుంటున్నాన’ని మూర్తి తెలిపారు.
