అయ్యబాబోయ్.. ఏందిది? సముద్రంలో ఉండాల్సిన షిప్పు భూమిపైకి వచ్చేసిందేంటి? కొట్టుకొచ్చి కొంపల మీద పడిందా ఏంటి? అన్నట్టుంది కదా. కానీ, అది షిప్పు కానే కాదు. కొట్టుకురానే లేదు. సముద్రంలో ఉండనే ఉండదు. అవును, అచ్చంగా భూమిపైనే ఉంటుంది. ఎందుకంటే దాన్ని కడుతున్నారు కాబట్టి. అది ఓడ రూపంలో ఉన్న బిల్డింగ్ కాబట్టి. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లో దీన్ని కడుతున్నారు. దాదాపు కట్టేశారనుకోండి.
డేవిడ్ సెర్నీ అనే శిల్పి, తోమస్ సిజార్ అనే ఆర్కిటెక్టు దీనికి డిజైన్ చేశారు. ట్రైగెమా అనే రియల్ఎస్టేట్ కంపెనీ దీన్ని కట్టింది. రెండేళ్లుగా దీని నిర్మాణం చేస్తున్నారట. 8 డిజైన్లను కాదని ఈ షిప్ డిజైన్కు ఓకే చేసింది కంపెనీ. అన్ని స్పెషాలిటీస్ ఉన్నా దాని చుట్టూ వివాదాలూ ముసిరాయి. ఈ బిల్డింగ్ను ప్రేగ్లోని నోవా బ్యుటోవైస్ అనే చోట కడుతున్నారు. ఆ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఎవరూ ఎత్తైన బిల్డింగులు కట్టడానికి లేకుండా నిషేధం విధించారు. కానీ, ట్రైగెమా మాత్రం వాటన్నింటినీ కాదని ఈ షిప్ బిల్డింగ్ను కట్టింది. దీని పేరు ‘టాప్ టవర్’! అన్ని వివాదాలు సద్దుమణిగి, ప్రభుత్వం అనుమతులు ఇచ్చేస్తే పేరుకు తగ్గట్టే ప్రేగ్లో ఇది టాప్ టవర్ అయిపోతుంది.

