కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా చెప్పుకున్న తాజా విజిల్ బ్లోయర్
బెంగళూరు : మొదటి విజిల్ బ్లోయర్ల ఆరోపణల గందరగోళం ఇంకా చల్లారకుండానే ఇన్ఫోసిస్కి మరో చిక్కు వచ్చి పడింది. ఇంకొక విజిల్ బ్లోయర్ తాజాగా మరిన్ని ఆరోపణలను సీఈఓ సలీల్ పరేఖ్పై గుప్పించారు. సీఈఓ సలీల్ పరేఖ్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని చెబుతూ, ఆయనపై చర్యలు తీసుకోవల్సిందిగా తమకు రెండో విజిల్ బ్లోయర్ నుంచి తేదీ లేని లెటర్ ఇన్ఫోసిస్ ఛైర్మన్, డైరెక్టర్ల బోర్డుకు వచ్చింది. సలీల్ పరేఖ్ ఇన్ఫోసిస్లో చేరి 20 నెలలు కావస్తున్నా, ఆయన ఇంకా ముంబై నుంచే ఆపరేట్ చేస్తున్నారని, ఇది కంపెనీ అంతర్గత నియమాలకు విరుద్ధమని తాజా విజిల్ బ్లోయర్ పేర్కొన్నారు. సలీల్ పరేఖ్ను బెంగళూరుకు మారాల్సిందిగా బోర్డు ఎందుకు అడగలేకపోతోందని విజిల్ బ్లోయర్ ప్రశ్నించారు. ఇలా మారకపోవడం సలీల్ పరేఖ్ ట్రావెల్కు అయిన ఖర్చు రూ.22 లక్షలను ఇన్ఫోసిస్ భరించాల్సి వచ్చిందని ఆరోపించారు. కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా తన పరిచయం చేసుకున్నారు ఈ విజిల్ బ్లోయర్. ఐతే, సీఈఓపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తన పూర్తి వివరాలు వెల్లడించడానికి భయపడుతున్నట్లు తెలిపారు. నేనెవరో చెబితే నాపై ప్రతీకార చర్యలకు పాల్పడతారనే ఆందోళన వ్యక్తం చేశారు విజిల్ బ్లోయర్. సీఈఓ సలీల్ పరేఖ్ నేతృత్వంలో కంపెనీలో అంతకు ముందు నుంచి ఉన్న విలువలన్నీ మంటగలిసిపోతున్నాయని, ఆ బాధతోనే బోర్డు దృష్టికి తీసుకువస్తున్నానని విజిల్ బ్లోయర్ వాపోయారు. ఈ రెండో కంప్లెయింట్ గురించి మాట్లాడేందుకు తమ దగ్గర అదనపు సమాచారమేదీ లేదని ఇన్ఫోసిస్ అధికార ప్రతినిధి చెప్పారు.

