- మార్జిన్లు పెరగడమే కారణం
న్యూఢిల్లీ: క్రూడాయిల్ రిఫైనరీలకు మార్జిన్లు ఎక్కువ కావడం, చమురుకు డిమాండ్ బాగుండటంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెల దిగుమతులు రోజుకు 4.86 మిలియన్ బ్యారెల్స్కు (బీపీడీ) పెరిగాయి. డిసెంబర్ 2020 తరువాత ఇదే అత్యధికం. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఎకానమీ అయిన ఇండియా చమురు దిగుమతులు జనవరి 2022 నుండి 5శాతం పెరిగాయి. ఫిబ్రవరి 2021లో తక్కువ బేస్ వల్ల 24 శాతం భారీ పెరుగుదల కనిపించింది. నిర్వహణ కోసం ఒక రిఫైనరీ మూసేసినా, క్రూడాయిల్ దిగుమతులు పెరిగాయి. భారతీయ రిఫైనర్లు సాధారణంగా చమురును ప్రాసెసింగ్ చేయడానికి రెండు నెలల ముందు కొంటారు. స్థానిక మార్కెట్లలో గతంలో పెట్రోల్, డీజిల్ అమ్మడం వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకోవడానికి భారీగా క్రూడాయిల్ను కొంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగిరావడంతో మార్జిన్లు ఎక్కువ వస్తున్నాయి.
మన అవసరాల్లో
80శాతం దిగుమతులతోనే
ఎగుమతుల నుండి లాభం పొందడానికి రిలయన్స్ వంటి కొన్ని రిఫైనరీలు యూనిట్ల రిపేర్లను వాయిదా వేశాయి. పెరుగుతున్న డిమాండ్ను తీర్చుతున్నాయి. ప్రభుత్వం
కొవిడ్-19 రిస్ట్రిక్షన్లను ఎత్తివేసినప్పటి నుండి పెట్రోల్, డీజిల్ సేల్స్ పెరుగుతున్నాయి. ఇండియా.. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. మన ముడి చమురు అవసరాలలో 80శాతం కంటే ఎక్కువ దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. సాధారణంగా ఇండియా గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువగా చమురు కొంటుంది. ప్రస్తుతం ఇతర మార్కెట్లు చవకగా చమురు అమ్ముతుండటంతో వాటి నుంచి కొంటోంది. మన చమురు దిగుమతుల్లో ఒపెక్ వాటాను తగ్గించేస్తున్నాం. గత నెలలో చమురు దిగుమతుల్లో కెనడా, అమెరికా దిగుమతుల వాటా 14శాతం పెరిగింది. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కొనుగోళ్లు అక్టోబర్ 2021 నుండి కొద్దిగా పెరిగాయి. గత నెలలో ఆఫ్రికన్ దేశాల నుంచి చమురు కొనుగోళ్లు నాలుగు నెలల గరిష్టానికి పెరిగాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ తరువాత భారతదేశానికి ఇరాక్ నుంచి చమురు సప్లై ఎక్కువగా ఉంటుంది. నైజీరియాకు బదులు కువైట్ భారతదేశానికి నాలుగో అతిపెద్ద సరఫరాదారుగా మారింది.
