సాంస్కృతిక స్వాతంత్య్ర సారథి వల్లాభాయ్ పటేల్

సాంస్కృతిక స్వాతంత్య్ర సారథి వల్లాభాయ్ పటేల్

భారతదేశ ప్రాచీన ఆధ్యాత్మిక, సాంస్కృతిక  ఘనత మళ్లీ  పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.  ఆధునిక యుగపు ఆశయాలు..  ప్రాచీన కాలపు సాంస్కృతిక, సంప్రదాయిక వైభవాన్ని  ప్రాతిపదికలుగా చేసుకొని నవ భారతం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గుజరాత్ లోని పంచ్ మహల్ జిల్లా పావగఢ్ హిల్ లోని శ్రీ కాళికా మాత ఆలయాన్ని ఇటీవల పునర్నిర్మించారు.  శనివారం  ఆ ఆలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.  ఈసందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ పతాకాన్ని  ఆవిష్కరించారు.

రూ.21వేల కోట్ల విలువైన  అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అనంతరం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. ‘‘ చాలా శతాబ్దాల తర్వాత ఈ ఆలయంపై మళ్లీ జెండా ఎగిరింది.  అది మన విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా..  శతాబ్దాలు గడిచినా విశ్వాసం నిత్యనూతనంగా నిలిచే ఉంటుంది అనేందుకు ప్రతీక’’ అని పేర్కొన్నారు.  పావగఢ్ లో మాతా మహాకాళి శక్తి పీఠంతో పాటు జైన ఆలయం కూడా ఉందన్నారు. భారతదేశ సాంస్కృతిక స్వాతంత్య్ర సాధనకు సంబంధించిన పోరాటానికి సర్దార్ వల్లాభాయ్ పటేల్  ఆద్యుడని మోడీ గుర్తు చేశారు. గుజరాత్ లోని చారిత్రక సోమ్ నాథ్ ఆలయ పునరుద్ధరణ పనుల నిర్వహణలో  నాడు పటేల్ కీలక పాత్ర పోషించారని చెప్పారు.  కాగా, అంతకుముందు వడోదరలో ప్రధాని మోడీ రూ.21వేల కోట్ల విలువైన  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.