ధరలు మరింత తగ్గుతాయి

ధరలు మరింత తగ్గుతాయి
  • 2030 నాటికి 1.7 కోట్ల ఈవీల సేల్స్​
  • ఏటా 49 శాతం గ్రోత్​కు అవకాశం
  • ధరలు మరింత తగ్గుతాయి
  • వెల్లడించిన  ఐఈఎస్​ఏ  రిపోర్టు


ముంబై: భారతీయ ఎలక్ట్రానిక్​ వెహికల్​ (ఈవీ) మార్కెట్ 2030 నాటికి 1.7 కోట్ల యూనిట్ల వార్షిక అమ్మకాలను సాధించనుంది. ఇది 2021–-2030 మధ్య ఏటా 49 శాతం  విస్తరిస్తుందని అంచనా. పెరుగుతున్న ఇంధన ధరలు, ఈవీ సెక్టార్లోకి కొత్త సంస్థలు రావడం, ఈవీ టెక్నాలజీలో డెవలప్​మెంట్​, కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీలు, మద్దతు వంటివి ఈవీ మార్కెట్​కు ఎంతోసాయపడతాయని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ( ఐఈఎస్​ఏ) రిపోర్టు పేర్కొంది. దీని ప్రకారం..ఇండియా ఈవీ పరిశ్రమను 2020లో కరోనా దెబ్బతీసినా,  మందగమనం నుండి త్వరగానే కోలుకుంది. దేశీయ మార్కెట్లో మొత్తం 4.67 లక్షల ఈవీ అమ్మకాలలో ఎలక్ట్రిక్ టూవీలర్​ వెహికల్స్​ విభాగం 50 శాతం వాటాను సాధించింది. 2021లో లో-స్పీడ్ ఈ–-త్రీ-వీలర్‌‌ అమ్మకాలూ పెరిగాయి. ఇతర విభాగాలు కూడా సంవత్సర కాలంలో చెప్పుకోదగ్గ గ్రోత్​ను చూపించాయి. భారతీయ ఈవీ మార్కెట్ 2021–2030 మధ్య ఏటా 49 శాతం సీఏజీఆర్ సాధిస్తుంది. ఆ సమయానికి దాదాపు 1.7 కోట్ల అమ్మకాలు రికార్డు అవుతాయి. వీటిలో మెజారిటీ వాటా ఎలక్ట్రిక్ టూవీలర్లదే ఉంటుంది. ఇయర్లీ  బ్యాటరీ  డిమాండ్ ఏటా 41 శాతం  సీఏజీఆర్ వద్ద పెరిగి 142 గిగావాట్​ అవర్​కి చేరుకుంటుంది.

2021లో మార్కెట్ కెపాసిటీ 6.5 గిగావాట్​ అవర్​కు చేరింది. 2024-–2025 తర్వాత ఈవీ మార్కెట్​ మరింత వేగంగా పెరుగుతుందని అంచనా. ఎందుకంటే వీటి ధరలు సాధారణ వెహికల్స్ ధరల స్థాయులకు తగ్గుతాయి. బ్యాటరీ ధరలూ తగ్గుతాయి. 2021 వరకు భారతీయ ఈవీ ఎకోసిస్టమ్​లో లెడ్-యాసిడ్ బ్యాటరీలు ఆధిపత్యం ఉంది. ఈ–-రిక్షాలకు అధిక డిమాండ్ కారణంగా మార్కెట్‌‌లో వీటి వాటా 81 శాతం ఉంది. లిథియం- అయాన్ బ్యాటరీల మార్కెట్ వాటా కూడా పెరుగుతోంది.  2021లో మొదటిసారిగా  ఈ బ్యాటరీల డిమాండ్ ఒక గిగావాట్​ అవర్​ను మించింది.  ఈవీలను చౌకగా తయారు చేసేందుకు  ప్రభుత్వం ప్రారంభించిన ఫేమ్​ II ఇన్సెంటివ్​ స్కీమ్​ను కేంద్రం  2024 వరకు పొడిగించింది. ఈ స్కీము వల్ల ఇప్పటికే 18 కోట్లపైగా ఆటోమొబైల్స్‌‌కు మేలు జరిగిందని ఐఈఎస్​ఏ రిపోర్టు తెలిపింది.