2030 నాటికి జపాన్ను దాటి మూడో స్థానానికి..
మరో 8 ఏళ్లలో అమెరికాను అధిగమించనున్న చైనా
యూకే కన్సల్టెన్సీ సంస్థ సీఈబీఆర్ వెల్లడి
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ ఆర్థిక వ్యవస్థను ఇండియా మరోసారి అధిగమిస్తుందని ఆ దేశ కన్సల్టెన్సీ సంస్థ సీఈబీఆర్ అంచనావేసింది. వచ్చే ఐదేళ్లలో యూకేను దాటి ఐదో అతిపెద్ద ఎకానమీగా ఇండియా ఎదుగుతుందని ఈ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం గ్లోబల్గా ఆరో అతిపెద్ద ఎకానమీగా ఉన్న ఇండియా, 2019 లోనే ఇంగ్లండ్ను అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది. కానీ కరోనా సంక్షోభం, రూపాయి విలువ పడిపోవడంతో ఈ ఏడాది తిరిగి ఆరో స్థానానికి పడిపోయింది. 2025 నాటికి ఇంగ్లండ్ను దాటి ఐదో అతిపెద్ద ఎకానమీగా, 2030 నాటికి జపాన్ను దాటి మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా నిలుస్తుందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్(సీఈబీఆర్) పేర్కొంది. 2024 వరకు ఐదో స్థానంలో ఇంగ్లండ్ కొనసాగుతుందని, 2025 లో ఇండియా యూకేని అధిగమిస్తుందని పేర్కొంది. 2021 లో దేశ ఎకానమీ 9 శాతం పెరుగుతుందని, 2022లో 7 శాతం పెరుగుతుందని అంచనావేసింది. ‘దేశ ఎకానమీ పెరుగుతున్న కొద్దీ గ్రోత్ రేటు తగ్గుతుంది. 2035 లో దేశ జీడీపీ వృద్ధి రేటు మైనస్ 5.8 శాతంగా నమోదవుతుందని అంచనావేస్తున్నాం. 2030 లో జపాన్ను అధిగమించి మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా మారాక ఈ గ్రోత్ రేటును చూస్తాం. 2025 లో ఇంగ్లండ్ను, 2027 లో జర్మనీని, 2030 నాటికి జపాన్ను ఇండియా ఆర్థిక వ్యవస్థ దాటుతుంది’ అని ఈ యూకే సంస్థ పేర్కొంది.
చైనానే నెంబర్ వన్..
2028 నాటికి అమెరికాను దాటి గ్లోబల్గా అతిపెద్ద ఎకానమీగా చైనా ఎదుగుతుందని సీఈబీఆర్ అంచనావేసింది. ఈ సంస్థ ముందుగా అంచనావేసిన దానికంటే ఇది ఐదేళ్లు ముందు కావడం విశేషం. కరోనా ప్రభావం అమెరికాపై కంటే చైనాపై తక్కువగా ఉందని సీఈబీఆర్ తెలిపింది. అమెరికా రెండో స్థానానికి పడిపోతుందని, 2030 వరకు జపాన్ మూడో స్థానంలో కొనసాగుతుందని పేర్కొంది. ఆ తర్వాత ఇండియా జపాన్ను దాటుతుందని, జర్మనీ ఐదో స్థానానికి పడిపోతుందని తెలిపింది.
కరోనా ముందు నుంచే స్లోడౌన్లో ఇండియా..
‘కరోనా సంక్షోభానికి ముందు నుంచే ఇండియన్ ఎకానమీ స్లోడౌన్లో ఉంది. 2019–20 లో ఇండియన్ జీడీపీ గ్రోత్ రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. ఇది అంతకు ముందటి 11 ఏళ్లలో తక్కువ. 2018–19 లో దేశ జీడీపీ గ్రోత్ రేటు 6.1 శాతంగా నమోదయ్యింది’ అని ఈ సంస్థ పేర్కొంది. బ్యాంకింగ్ సిస్టమ్లో సమస్యలు, ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు ఇంకా అడ్జెస్ట్ కాకపోవడం, గ్లోబల్ ట్రేడ్ సన్నగిల్లడం వంటి అంశాలు ఇండియన్ జీడీపీ పడిపోవడానికి కారణమయ్యాయని తెలిపింది. కరోనా ప్రభావం ఇండియాపై తీవ్రంగా ఉందని ఈ సంస్థ అంచనావేసింది. డిసెంబర్ నాటికి 1.40 లక్షల మంది కరోనా కారణంగా మరణించారని పేర్కొంది. కానీ ప్రతి లక్ష మందికి 10 మరణాలను ఇండియా నమోదు చేసిందని, ఇది యూరప్ అమెరికాలలో నమోదైన మరణాలకంటే తక్కువని తెలిపింది. ‘ఈ ఏడాది ఏప్రిల్–జూన్ పిరియడ్లో దేశ జీడీపీ మైనస్ 23.9 శాతంగా నమోదయ్యింది. గ్లోబల్గా డిమాండ్ పడిపోవడం, లాక్డౌన్ వలన డొమెస్టిక్ డిమాండ్ కూడా తగ్గడంతో ఒక క్వార్టర్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది’ అని ఈ యూకే సంస్థ ఓ రిపోర్ట్లో పేర్కొంది. కరోనా రెస్ట్రిక్షన్లు ఎత్తేస్తుండడంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతోందని తెలిపింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2 లో దేశ జీడీపీ గ్రోత్ రేటు మెరుగుపడి మైనస్ 7.5 శాతంగా నమోదైంది.
ఆర్థిక వ్యవస్థకు దన్నుగా వ్యవసాయం..
ఇప్పటి వరకు దేశ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగం నడిపిందని సీఈబీఆర్ పేర్కొంది. పంట విస్తీర్ణం పెరగడం, రుతు పవనాలు బాగుండడం వంటి కారణాలతో ఈ ఏడాది అగ్రికల్చర్ సెక్టార్ మంచి గ్రోత్ను నమోదు చేసిందని తెలిపింది. కరోనా సంక్షోభం ఎంత తొందరగా క్లియర్ అయితేనే అంత తొందరగా గ్లోబల్, ఇండియా ఎకానమీలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని అభిప్రాయపడింది. వ్యాక్సిన్ తయారీలో మిగిలిన దేశాల కంటే ఇండియా ముందంజలో ఉందని, వచ్చే ఏడాది విజయవంతంగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తుందని అభిప్రాయపడింది. మీడియం టూ లాంగ్ టెర్మ్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు సాయంగా ఉంటాయని సీఈబీఆర్ పేర్కొంది. దేశ వ్యవసాయ రంగంపై మెజార్టీ ప్రజలు ఆధారపడి బతుకుతున్నారని, షార్ట్టెర్మ్లో వీళ్లకు ఇన్కమ్ సపోర్ట్ అందిస్తూ కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలను అమలు చేయాలని సలహాయిచ్చింది.
