పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో బుధవారం వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండు, మూడు మ్యాచ్ లను కోహ్లీ సేన గెలుచుకుంది.
మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. ఓపెనర్లు క్రిస్ గేల్ 72, లూయిస్ 43 పరుగులు చేశారు. పది ఓవర్లు దాటకుండానే వారి స్కోరు 100 పరుగులకు చేరుకుంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ను 35 ఓవర్లకు కుదించారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం కోహ్లీ సేనకు 255 పరుగులుగా నిర్ధేశించారు. 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది.
కెరీర్ లో 43వ సెంచరీ సాధించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
