హైదరాబాద్, వెలుగు: వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు పెరగనున్నాయి. వాహనం మోడల్, సీసీని బట్టి 4 నుంచి 21 శాతం వరకు ఈ పెంపు ఉండనుంది. కొత్త రేట్లు ఈ నెల 16 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) ఉత్తర్వులు జారీ చేసింది. బైక్ లు, కార్లకు ప్రీమియంను పెంచినా.. 350 సీసీ మించిన సూపర్ బైక్లు, 1,500 సీసీ లగ్జరీ కార్ల ప్రీమియం రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.
ప్రజా రవాణా వాహనాలతోపాటు ప్రైవేట్ గూడ్స్ వాహనాలు, స్కూల్ బస్సులపై కూడా బీమా ప్రీమియం పెరిగింది. ఈ– రిక్షాలకు మాత్రం గత రేటే వర్తిస్తుంది. దీర్ఘకాలిక సింగిల్ ప్రీమియం రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. కొత్త కార్లకు మూడేళ్లు తప్పనిసరి థర్డ్ పార్టీ బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం ధరల పెంపుపై వాహనదారులు మండిపడుతున్నారు.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలతో సతమతవుతున్నామని, ఇప్పుడు బీమా ప్రీమియం రేట్లు పెంచడంతో తమపై భారం పెరుగుతోందని యెల్లో ప్లేట్ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచుతున్నా క్లెయిమ్ మాత్రం పెంచడంలేదని, ప్రీమియం పెంపుపై ఐఆర్డీఏఐ పునరాలోచించాలని కోరుతున్నారు.
