న్యూఢిల్లీ : మీ దగ్గర పాన్ కార్డు ఉందా..? అయితే ఆ పాన్ను ఆధార్తో లింక్ చేసుకోండి. ఒకవేళ ఆధార్తో పాన్ లింక్ చేసుకోకపోతే.. ఆ పాన్ కార్డు ఆగస్టు 31 తర్వాత డియాక్టివేట్ కానుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 40 కోట్ల పాన్ కార్డులున్నాయి. వాటిలో సుమారు 22 కోట్ల పాన్ కార్డులు మాత్రమే ఆధార్తో లింక్ అయి ఉన్నట్టు తెలిసింది. మిగిలిన 18 కోట్ల పాన్ కార్డులు ఆధార్తో లింక్ లేనట్టు వెల్లడైంది. ఈ కార్డులు వచ్చే నెల 31 వరకు ఆధార్తో లింక్ కాకపోతే, అవి డియాక్టివేట్ అవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆధార్తో పాన్ కార్డులను లింక్ చేసే ప్రక్రియను ప్రభుత్వం కొన్నేళ్ల కిందటే ప్రారంభించింది. ఈ రెండు నెంబర్లను లింక్ చేయడంపై ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ రెండు నెంబర్లను లింక్ చేయడంతో ప్రైవసీ సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆధార్తో లింక్ లేని పాన్ కార్డు ఉన్నా.. లేదంటే అసలకే పాన్ కార్డు లేకపోయినా.. ఆధార్ సహాయంతో ట్యాక్స్ ఫైలింగ్ను చేపట్టవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఆధార్తో ట్యాక్స్ ఫైలింగ్ను చేపడితే ఆ వ్యక్తి పేరు మీద కొత్త వర్చువల్ పాన్ నెంబర్ జనరేట్ అవుతుందని పేర్కొంది. ఈ నెంబర్ను ఫైలింగ్లో పేర్కొన్న ఆధార్తో లింక్ చేసుకోవాలని చెప్పింది. సెప్టెంబర్ 1 తర్వాత ట్యాక్స్ రిటర్న్ల దాఖలు చేసేటప్పుడు ఆధార్తో పాన్కు లింక్ లేకుంటే… వారికి ఆదాయపు పన్ను శాఖ నుంచి కొత్త పాన్ నెంబర్ వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఐటీ రిటర్నుల ఫైలింగ్కు ఈ రెండు డాక్యుమెంట్ల లింక్ తప్పనిసరి అని సుప్రీం కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆధార్తో పాన్ లింక్ చేసుకునే తుది గడువులను ప్రభుత్వం పలుమార్లు పెంచింది. పదే పదే గడువు పెంచినా.. ఆధార్తో పాన్ను లింక్ చేసుకోనివారి సంఖ్య లక్షల్లో ఉంది. ఈ కార్డులు నిజమైనప్పటికీ.. వాటిని బ్లాక్ చేస్తామని, అవి ఆగస్ట్ 31 తర్వాత ఇన్వాలిడ్ అవుతాయని ప్రభుత్వ ఆఫీసర్ ఒకరు చెప్పారు.
