ఐసీఐసీఐ బ్యాంక్ -వీడియోకాన్ కంపెనీలకు వేల కోట్ల రుణం కోసులో అరెస్ట్ అయిన ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్లను జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదల చేసేందుకు బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది. గత కొన్ని రోజుల క్రితం వేణుగోపాల్ ధూత్ వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు మంజూరు చేసిన రుణాలకు సంబంధించి అవకతవకలు పాల్పడినట్టు ఆరోపిస్తూ సీబీఐ.. చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లను అరెస్టు చేసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. తమను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ముందస్తు సమాచారం లేకుండా తమను అరెస్ట్ చేశారని, వారి రిమాండ్ ఆర్డర్లను పక్కన పెట్టాలని వారు కోరారు. నోటీసు జారీ తప్పనిసరి చేస్తూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 41Aని కూడా ఉల్లంఘించారని తెలిపారు.
జనవరిలో తమ కుమారుడి పెళ్లి జరగాల్సి ఉందని, ఈ సమయంలోనే తమను అరెస్టు చేసిన సమయాన్ని కూడా వారు పిటిషన్లో పేర్కొన్నారు. కొచ్చర్స్ ఏకైక కుమారుడి వివాహం జనవరి 15న జరగాల్సి ఉంది. త్వరలో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 4 సంవత్సరాల ఎఫ్ఐఆర్ తర్వాత వీరిద్దరిని అరెస్టు చేయడం గమనార్హం.
వాదనలు
2022 జూలై 4న కొచ్చర్కు సీబీఐ సమన్లు జారీ చేసిందని, కానీ వెళ్లలేకపోయారని, చివరకు జూలై 8న వెళ్లారని చందా కొచ్చర్ తరఫు సీనియర్ న్యాయవాది అమిత్దేశాయ్ తెలిపారు. డిసెంబర్ 23, 2022న, కొచ్చర్లను పర్ఫంక్టరీ ఇంటరాగేషన్ తర్వాత అరెస్టు చేసినట్లు దేశాయ్ తెలిపారు. ఐదు నెలల తర్వాత డిసెంబర్ 15, 2022న Cr.PC సెక్షన్ 41A కింద నోటీసు జారీ చేసి, ఆ తర్వాత అరెస్టు చేయడానికి కారణమేమిటి అని దేశాయ్ ప్రశ్నించారు.
కేసు
ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.3,250 కోట్ల రుణాన్ని వీడియోకాన్ గ్రూపు పొందిన తర్వాత.. అందులో కోట్లాది రూపాయలను దీపక్ కొచ్చర్ నిర్వహించే న్యూపవర్లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులుగా పెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో చందా కొచ్చర్ దంపతులు మోసం, అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. ఐపీసీ, మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం నిబంధనల కింద చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్తో పాటు వీడియోకాన్ గ్రూపునకు చెందిన వేణుగోపాల్ ధూత్, న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్లపై ఎఫ్ఐఆర్ను సీబీఐ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ ముగ్గురూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
