న్యూఢిల్లీ: దేశంలో ఆరు ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ను లాంచ్ చేయడానికి రూ. 4 వేల కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని హ్యుండయ్ మోటార్స్ ప్రకటించింది. ఈ ఆరు మోడల్స్ను 2028 లోపు తీసుకొస్తామని పేర్కొంది. కొత్త మోడల్స్ను, ఇప్పటికే గ్లోబల్గా ఆఫర్ చేస్తున్న మోడల్స్ను ఇండియాలో లాంచ్ చేస్తామని కంపెనీ పేర్కొంది. దేశంలోని ఈవీ కార్ల సెగ్మెంట్లో విస్తరించేందుకు భారీగా ప్లాన్స్ వేస్తున్నామని, వచ్చే ఏడాది ఓ ఈవీ మోడల్ను ఇండియాలో లాంచ్ చేస్తామని కంపెనీ ఎండీ ఎస్ఎస్ కిమ్ అన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం రూ. 4 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం బీఈవీ ప్లాట్ఫామ్ను కంపెనీ ఆపరేట్ చేస్తోంది. ఈ ప్లాట్ఫామ్ను దేశంలో అందుబాటులోకి తెస్తామని కంపెనీ తెలిపింది.
