న్యూఢిల్లీ: తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైకులను అందిస్తున్న హైదరాబాద్ ఈవీ స్టార్టప్ ఆటూ మొబైల్ ఇండ్ల ముంగిటికే షోరూమ్లను తీసుకొచ్చింది. ‘వీల్స్ ఆన్ షోరూమ్’ పేరుతో ప్రీమియం మొబైల్ రిటైల్ అవుట్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లకు ఇవి అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. బైకులను టెస్ట్ డ్రైవ్ చేయడంతోపాటు నచ్చితే ఇక్కడే కొనొచ్చు. వీల్స్ ఆన్ షోరూమ్లో మొదట ఆటమ్ 1.0 ఈవీని ప్రదర్శిస్తారు. తరువాత కెఫే రేసర్ స్టైల్ ఈ–--బైక్ వెర్షన్ను అందుబాటులోకి తెస్తారు. వచ్చే ఏడాదిలో దేశమంతటా పది మొబైల్ షోరూమ్లను నిర్వహిస్తారు.
‘‘ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో కస్టమర్లు ప్రతి వస్తువు తమ ఇంటి ముంగిటికే రావాలని కోరుకుంటున్నారు. అందుకే మేం డి2సి (డైరెక్ట్ టూ కస్టమర్) మోడల్ను తొలిసారిగా తీసుకొస్తున్నాం. మా వెబ్పోర్టల్ ద్వారా ఆర్డర్లను తీసుకొని, నేరుగా హోమ్ డెలివరీ ఇస్తాం. ఇక్కడితో ఆగిపోకుండా ఈ ఆలోచనను మరింత విస్తరించి షోరూం ఆన్ వీల్స్ను ప్రారంభించాం’’ అని ఆటు మొబైల్ సీఈఓ, ఫౌండర్ వంశీ గడ్డం చెప్పారు. కస్టమర్లకు సౌకర్యంగా ఉండే చోట టెస్ట్ రైడ్ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇక నుంచి టెస్ట్ రైడ్ కోసం కస్టమర్లు ఇంటి నుంచి ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు. యువత ఎక్కువగా ఉండే కాలేజీలు, కేఫ్ల దగ్గర షోరూం ఆన్ వీల్స్ వెహికల్ను ఉంచుతారు. రాబోయే 12 నెలల్లోపు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, గోవా, ఢిల్లీ, ముంబై, కోల్కతా, జైపూర్, గుర్గావ్లకు తమ షోరూం ఆన్ వీల్స్ లను తేవడానికి ఆటు మొబైల్ ఏర్పాట్లు చేస్తోంది.
లేటెస్ట్ డిజైన్.. ఆహ్లాదకర వాతావరణం
కస్టమర్లు, ఆటోమొబైల్ ఎక్స్పర్టుల అందించిన వివరాలను స్టడీ చేసి ఆటు మొబైల్ఈ షోరూమ్లను తీర్చిదిద్దింది. షోరూంను డీసీఎం వ్యాన్లో నిర్మించారు. ఇది 17.5 అడుగుల పొడవు, 7.0 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో -బైక్లను ప్రదర్శిస్తారు. కస్టమర్ల కోసం లాంజ్ కూడా ఉంటుంది. కెఫె రేసర్ స్టైల్ కొత్త ఆటమ్ బైకుకు పేటెంట్ కూడా వచ్చిందని వంశీ చెప్పారు. ఈవీలను ఎంకరేజ్ చేయడానికి, తమ బైకులను కస్టమర్ల వద్దకు తీసుకెళ్లడానికి మొబైల్ షోరూములు ఎంతో ఉపయోగపడుతాయన్నారు.
ఆటమ్కు అద్భుత ఆదరణ..
హైదరాబాద్లో 2020 అక్టోబరు ఐదు నుంచి అందుబాటులోకి వచ్చిన ఆటమ్ ఈ–-బైక్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కేవలం రూ. 55 వేల ధర ఉండే ఆటమ్ బైకులో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. సాలిడ్ బాడీ, వింటేజ్ డిజైన్, అధిక మైలేజీ కారణంగా ఇది చాలా ఆర్డర్లను సంపాదించుకుంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతా, చెన్నై, బెంగళూర్ల నుంచి 1500కు పైగా బుకింగ్స్ వచ్చాయి. ఇప్పటికే 800లకు పైగా ఆటమ్ 1.0 –-బైక్లను డెలివరీ చేశారు. ఈ బైకుకు లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా పవర్ అందుతుంది. కేవలం నాలుగు గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చెయ్యొచ్చు. ఒకసారి ఛార్జి చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లొచ్చు. బ్యాటరీ ఏడాది వారెంటీతో వస్తుంది. ఆకట్టుకునే రంగుల్లో లభిస్తుంది. ఎన్నో టెస్టులను ఎదుర్కొన్న ఆటమ్ కొత్త మోడల్ కెఫే రేసర్ అనుభూతిని అందిస్తుంది.
మనదేశంలో దొరికే స్పేరు పార్టులతోనే దీనిని డెవలప్ చేశామని వంశీ చెప్పారు. ఆటమ్ 1.0 తయారీ కోసం హైదరాబాద్లోని పటాన్చెరువులో మానుఫ్యాక్చరింగ్ యూనిట్ను నిర్మించారు. ‘ఆటమ్ 1.0’ను లో- స్పీడ్ బైక్గా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసిఎటి) గుర్తించింది. ఫలితంగా దీనిని బిజినెస్ అవసరాల కోసమూ వాడుకోవచ్చు. అంతేగాక ఆటమ్ 1.0కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దీన్ని నడిపే వ్యక్తికి లైసెన్స్ అవసరం లేదని వంశీ గడ్డం చెప్పారు. త్వరలోనే మరిన్ని ఈ–బైక్లను, స్కూటర్లను తెస్తామని వెల్లడించారు. తక్కువ దూరం ప్రయాణాలకు ఆటమ్ బైకులు అనువుగా ఉంటాయని చెప్పారు. మరిన్ని వివరాల కోసం https://www.atumobile.co/ వెబ్సైట్ను చూడొచ్చు.
