డిజిటల్‌‌ పేమెంట్స్‌‌లో హైదరాబాద్​ 2, తెలంగాణ 5

డిజిటల్‌‌ పేమెంట్స్‌‌లో హైదరాబాద్​ 2, తెలంగాణ 5

హైదరాబాద్‌‌, వెలుగు : డిజిటల్‌‌ పేమెంట్స్‌‌లో హైదరాబాద్‌‌ సిటీ, తెలంగాణ రాష్ట్రాలు దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్‌‌ సిటీ బెంగళూరు తర్వాత రెండో ప్లేస్‌‌లో నిలుస్తుండగా, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అయిదో ప్లేస్‌‌లో నిలుస్తోంది. ఇండియాలో డిజిటల్‌‌ చెల్లింపుల తీరు, తెన్నుల మీద ప్రతీ మూడు నెలలకూ రేజర్‌‌పే విడుదల చేస్తున్న రిపోర్టు ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌‌ దాకా చూస్తే సిటీలో యూపీఐ పేమెంట్స్‌‌ ఏకంగా 222 శాతం పెరిగాయి. జనవరి–సెప్టెంబర్‌‌ 2019 మధ్య కాలంలో 59 శాతం వాటాతో గుగుల్‌‌ పే తిరుగులేని అధిపత్యంతో ఉండగా, ఫోన్‌‌ పే 32 శాతం వాటా పొందినట్లు రిపోర్టు వెల్లడించింది. సిటీలో ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌, ఫుడ్‌‌ అండ్‌‌ బెవరేజెస్‌‌, యుటిలిటీ పేమెంట్స్‌‌కు ఎక్కువగా డిజిటల్ రూపంలో జరుగుతున్నాయని పేర్కొంది.

హైదరాబాద్‌‌ తర్వాత ఎక్కువగా డిజిటల్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌ జరిగే జాబితాలో సికిందరాబాద్‌‌, ఖమ్మం, కరీంనగర్‌‌, వరంగల్‌‌, పాల్వంచలు ఉన్నట్లు తెలిపింది. నగరంలోని ఎంఎస్‌‌ఎంఈలలో పేమెంట్‌‌ లింక్స్‌‌, పేమెంట్‌‌ పేజస్‌‌ల వాడకం నానాటికీ పెరుగుతోందని వివరించింది. దేశం మొత్తం మీద చూస్తే డిజిటల్‌‌ పేమెంట్స్‌‌లో పేమెంట్‌‌ వాలెట్స్‌‌ వాటా క్రమంగా పెరుగుతోందని ఈ రిపోర్టు విడుదల సందర్భంగా రేజర్‌‌ పే సీటీఓ శశాంక్ కుమార్‌‌ వెల్లడించారు. డిజిటల్‌‌ పేమెంట్స్‌‌లోని వివిధ విభాగాలను ఒకటి చేస్తూ రేజర్‌‌పే సొల్యూషన్స్‌‌ అందిస్తోందని, చిన్న వ్యాపార సంస్థలకు అప్పులిచ్చేందుకూ సొల్యూషన్స్‌‌ ఉన్నాయని తెలిపారు.