- 2026 నాటికి 32శాతం సీఏజీఆర్ సాధిస్తాం
- లాజిస్టిక్ ప్రొవైడర్ డెల్హివరీ
హైదరాబాద్, వెలుగు: ఎక్స్ప్రెస్ డెలివరీ మార్కెట్లో తమకు అపారమైన అవకాశాలు ఉన్నాయని త్వరలో ఐపీఓకు వస్తున్న లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ డెల్హివరీ ప్రకటించింది. ఈ విభాగంలో మరిన్ని అవకాశాలను చేజిక్కించుకుంటామని తెలిపింది. వాల్యూమ్స్, ఆదాయపరంగా 2021 ఆర్థిక సంవత్సరంతో పాటుగా 2022 ఆర్థిక సంవత్సర మొదటి క్వార్టర్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఎక్స్ప్రెస్ పార్శిల్ డెలివరీ సంస్థ తమదేనని ప్రకటించింది. ఎక్స్ప్రెస్ పార్శిల్ విభాగం ఏటా 28–32 శాతం పెరగడంతోపాటు (సీఏజీఆర్) 2026 నాటికి మార్కెట్ సైజు 10–12 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.3 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సర తొలి క్వార్టర్లో మొత్తం ఈ–కామర్స్ వాల్యూమ్స్ (క్యాప్టివ్ ప్లేయర్స్తో సహా)లో 20శాతం మార్కెట్ వాటాను డెల్హివరీ సాధించింది. తలసరి ఆదాయం, మధ్య తరగతి ఆదాయం పెరుగుతుండటం, మిలీనియల్స్, జెనరేషన్ జెడ్ వంటి వారి నుంచి భారీ ఆర్డర్లు రావడం, స్మార్ట్ఫోన్లు చవగ్గా అందుబాటులోకి రావడం, కనెక్టివిటీ పెరగడం వంటివి తమ వ్యాపారానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపింది. ఈ –కామర్స్ సెక్టార్ 2018 నుంచి 2020 వరకు ఏటా 31శాతం గ్రోత్ సాధించింది. 2020 నుంచి 2026 నడుమ ఇది 30–33 శాతం పెరగొచ్చని అంచనా. డెల్హివరీ ఇప్పటి వరకు 100 కోట్ల ఎక్స్ప్రెస్ పార్శిల్ షిప్మెంట్స్ను డెలివరీ చేసింది. 2021 జూన్ క్వార్టర్ నాటికి కంపెనీ సేవలను 18,600 మంది ఉపయోగించుకున్నారు. వీరిలో ఈ–కామర్స్ రిటైలర్లు, డీ2సీ బ్రాండ్లు, ఓమ్నీ ఛానెల్ రిటైలర్లు, ఎస్ఎంఈలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ వంటివి ఉన్నాయి.
