మహారాష్ట్రలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు

మహారాష్ట్రలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాల్గర్‌ జిల్లాలోని వాంఘోస్‌ దహనులోని బాణాసంచా తయారీ కార్మాగారంలో గురువారం పేలుళ్లు సంభవించాయి. విశాల్ ఫైర్ వ‌ర్క్స్ కంపెనీలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో భారీ విస్పోటనం సంభవించింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి.  అలర్టైన స్థానికులు వెంటనే.. పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఫ్యాక్ట‌రీలో కార్మికులు ఉన్న‌ట్లు సమాచారం. 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు పాల్ఘర్ కలెక్టర్ కార్యాలయం తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పేలుడు శ‌బ్దాలు 15 నుంచి 20 కిలోమీట‌ర్ల వరకు వినిపించిన‌ట్లు స్థానికులు తెలిపారు. ఫ్యాక్ట‌రీలోని ర‌సాయ‌నాలు పెద్దఎత్తున ఉండటంతో.. భారీ పేలుళ్లు సంభవించినట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.