న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రోజులుగా పెరగకపోవడంతో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కు (హెచ్పీసీఎల్) జూన్ క్వార్టర్లో నికరంగా రూ. 10,196.94 కోట్లు నష్టం వచ్చింది. ఈ కంపెనీకి పోయిన ఏడాది ఇదే కాలంలో రూ. 1,795 కోట్ల నికర లాభం వచ్చింది. హెచ్పీసీఎల్తోపాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లు ధరలను పెంచడానికి కేంద్రం ఒప్పుకోలేదు. ఇన్ఫ్లేషన్ను అడ్డుకోవడానికి పెట్రోల్, డీజిల్ ధరలను మార్చలేదు.
భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు బ్యారెల్ ధర సగటున109 డాలర్ల ఉండగా, రిటైల్ పంపు బ్యారెల్ ధర 85–-86 డాలర్లకు మించడం లేదు. ధరలు పెంచకపోవడంతో జూన్ క్వార్టర్లో ఐఓసీ కూడా రూ. 1,992.53 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. హెచ్పీసీఎల్ కంటే చాలా పెద్దది అయినా ఐఓసీకి నష్టం తక్కువగా ఉంది. ఎందుకంటే దీనికి క్రూడ్ రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారాలు ఉన్నాయి. హెచ్పీసీఎల్ ఉత్పత్తి చేసే దానికంటే ఎక్కువ ఫ్యూయల్ను అమ్ముతుంది.దీనిని రిఫైనరీల నుంచి మార్కెట్ ధరలకే కొనాలి. సబ్సిడీ ధరలు వర్తించవు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ఉత్పత్తుల అమ్మకం ద్వారా హెచ్పీసీఎల్ ఆదాయం రూ. 77,308.53 కోట్ల నుంచి రూ. 1.21 లక్షల కోట్లకు పెరిగింది. అయితే, ఇప్పటి వరకు ఒక క్వార్టర్లో ఇంత నష్టం రావడం ఇదే మొదటిసారని హెచ్పీసీఎల్ తెలిపింది. రూపాయి విలువ తగ్గడంతో కార్పొరేషన్కు రూ.945.40 కోట్ల ఫారెక్స్ నష్టమూ వచ్చింది. మార్కెట్ రేట్ల ప్రకారం చమురు కంపెనీలు రిటైల్ ధరలను మార్చుకోవచ్చని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ ఇవి రేట్లను పెంచకుండా ఆపిందనే విమర్శలు ఉన్నాయి. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో 137 రోజులపాటు రేట్లను పెంచలేదు. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత అంతర్జాతీయ చమురు ధరలు విపరీతంగా పెరిగినా, దాదాపు 122 రోజుల నుంచి ధరలు మారడం లేదు.
