న్యూఢిల్లీ: ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో పరిస్థితులు బాగాలేనందున ఆరు డెట్ మ్యూచువల్/డెట్ ఫండ్ స్కీమ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇవన్నీ గురువారం నుంచి మొదలు కావాల్సి ఉంది. కార్పొరేట్ బాండ్ల మార్కెట్ నుంచి చాలా మంది ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకోవడం, లిక్విడిటీ దొరక్కపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కంపెనీ చెప్పింది.యూనిట్ హోల్డర్ల విలువను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని క్లారిటీ ఇచ్చింది. కార్పొరేట్ బాండ్ల మార్కెట్లలో లిక్విడిటీ దొరకడం లేదు కాబట్టి ఇదొక్కటే సరైన మార్గమని పేర్కొంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నిర్ణయం వల్ల రూ .30,853 కోట్ల విలువైన పెట్టుబడిదారుల సంపద ఇరుక్కుపోయింది. తాజా పరిణామం ఇతర డెట్ స్కీములపై కూడా ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ఎప్పుడు చెల్లిస్తారు ?
పైన పేర్కొన్న ఆరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. శుక్రవారం నుంచి ఈ స్కీముల్లో కొత్తగా పెట్టుబడులు గానీ, రిడెంప్షన్లు గానీ సాధ్యం కాదు. ఈ స్కీముల్లో డబ్బును ఇతర పథకాల్లోకి మళ్లించడమూ అసాధ్యం! ఇన్వెస్ట్మెంట్లను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును కంపెనీ ఇన్వెస్టర్లకు చెల్లిస్తుంది. ఎంత వస్తుంది ? ఎప్పుడు వస్తుంది ? అనేది కచ్చితంగా తెలియదు. ఇన్వెస్టర్లు చెల్లించిన మొత్తం, కంపెనీకి అందిన మొత్తం ఆధారంగా చెల్లింపు ఉంటుందని వైజ్ఇన్వెస్టర్డాట్కామ్కు చెందిన జాయ్దీప్ సేన్ అన్నారు.
వాట్ నెక్ట్స్?
ఈ ఆరు స్కీములను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇది నిర్వహించే ఇతర స్కీములపై తప్పక ప్రభావం ఉంటుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఇతర ఫండ్ హౌజ్ల డెట్ స్కీముల నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకోవడం పెరుగుతుందని అంటున్నారు. రాబోయే మూడు నెలల్లో ఎన్బీఎఫ్సీ రంగం తీవ్ర మైన ఇబ్బందుల్లో పడనుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ సమస్యను ఆర్బీఐ పరిశీలిస్తోంది. త్వరలోనే నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. అయితే మిగతా మ్యూచువల్ ఫండ్లు కూడా ఇలాగే అవుతాయని అనుకోవడం తప్పని ఫండ్మేనేజర్లు చెబుతున్నారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సూచిస్తున్నారు. మంచి పోర్ట్ఫోలియో ఉన్న ఫండ్హౌజ్లో ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించవచ్చని అంటున్నారు.
ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే…
- కరోనా వల్ల విధించిన లాక్డౌన్ వల్ల వ్యాపారాలన్నీ కుప్పకూలాయి. అప్పులను తీర్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఇన్వెస్టర్లలో టెన్షన్ ఎక్కువయింది.
- డెట్ మార్కెట్లకు లిక్విడిటీ దొరకడం కష్టంగా మారింది. కార్పొరేట్ బాండ్ల మార్కెట్లలో పరిస్థితులు బాగా లేకపోవడంతో ఇన్వెస్టర్ల నుంచి రిడెంప్షన్ రిక్వెస్టులు విపరీతంగా వస్తున్నాయి.
- కేవలం గత నెలలోనే రూ.1.94 లక్షల కోట్లు డెట్ ఫండ్ల నుంచి వెనక్కి వెళ్లాయి. ఈ పరిస్థితి నుంచి ఎన్బీఎఫ్సీలను రక్షించడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు
- రూపాయి–డాలర్ విండో, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ వంటి ద్వారా లిక్విడిటీ పెంచడానికి ప్రయత్నించినా, అప్పటికే ఆలస్యం జరిగింది. దీంతో మ్యూచువల్ ఫండ్ హౌజ్లు అప్పులు చేయాల్సి వచ్చింది.
- ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నందున యూనిట్ హోల్డర్లు నష్టపోవద్దనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వివరణ ఇచ్చింది.
రద్దయిన ఫండ్స్ ఇవే ..
1.ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్
2.ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూయల్ ఫండ్
3.ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్
4.ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్టర్మ్ ఇన్కం ప్లాన్
5.ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రాషార్ట్ బాండ్ ఫండ్
6.ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కం అపోర్చునిటీస్ ఫండ్
