5 మిలియన్‌ యూనిట్‌ అమ్మకాల మైలురాయిని చేరుకున్న ‘హిప్‌’

5 మిలియన్‌ యూనిట్‌ అమ్మకాల మైలురాయిని చేరుకున్న ‘హిప్‌’

న్యూఢిల్లీ: పవర్‌ ప్రొడక్ట్స్‌ తయారీలో అగ్రగామిగా నిలిచిన‌ హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (హిప్‌).. నేడు భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించి విజయవంతంగా 35 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. సుదీర్ఘ‌మైన ఈ ప్రయాణంలో.. భారతదేశంతో పాటుగా విదేశాలలో ఐదు మిలియన్లకు పైగా వినియోగదారులకు త‌మ ఉత్ప‌త్తుల‌ను అందిచింది. 1985లో ఇండియ‌న్ మార్కెట్‌లోకి ప్రవేశించిన మొట్టమొదటి జపనీస్‌ బహుళజాతి సంస్థ హిప్‌. ఈ కంపెనీ ఉత్పత్తుల‌తో భారత్‌ మరియు జపాన్‌ నడుమ ఆర్థిక సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అయ్యాయి. మొద‌టి నుంచి, ఈ కంపెనీ తమ వినియోగదారులకు పవర్‌ బ్యాకప్‌, వ్యవసాయం, నిర్మాణ రంగాలకు సంబంధించి వినూత్నమైన, పర్యావరణ అనుకూల, అత్యుత్తమ శ్రేణి ఉత్పత్తులను అందిస్తోంది.

దేశంలో మొట్టమొదటిసారిగా పోర్టబల్‌ జనరేటర్‌ మోడల్‌ ఈఎం 650ను హిప్‌ ఆవిష్కరించింది. దాదాపు 100కు పైగా డీలర్‌షిప్స్‌ నెట్‌వర్క్‌తో ఈ కంపెనీ.. పోర్టబల్‌ వాటర్‌ పంపులు, జనరల్‌ పర్పస్‌ ఇంజిన్స్‌, పవర్‌ టిల్లర్స్‌, బ్రష్‌ కట్టర్స్‌, లాన్‌ మూవర్స్‌ను అందించింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 600కు పైగా ఛానెల్‌ భాగస్వాముల నెట్‌వర్క్‌ మద్దతుతో ఈ ఉత్పత్తులను ఆవిష్క‌రించింది. 2003లో ఒక మిలియన్‌ యూనిట్‌ల మార్కును చేరుకున్న హిప్.. 2017లో 4 మిలియన్‌ల మార్కును , 2020లో 5 మిలియన్‌ల మార్కును చేరుకుంది. మూడు సంవత్సరాల స్వల్పకాలంలోనే 5 మిలియన్‌ల మైలురాయిని చేరుకుంది.

ఈ సంద‌ర్భంగా హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌లిమిటెడ్ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈవో, సీఎండీ తకహిరో యుఎడా మాట్లాడుతూ.. ‘‘మా వినియోగదారులకు నిబద్ధతతో కూడిన‌ సేవలనందించడం ప్రారంభించి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంలోనే 5 మిలియన్‌ యూనిట్ల మైలురాయిని చేరుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాం. సరైన ధరలలో అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడానికి మా వినియోగదారులు మాకు స్ఫూర్తినందిస్తున్నారు. ఇది అసాధారణ ప్రయాణం మరియు మేము అత్యాధునిక సాంకేతికతను అందిస్తూనే సాటిలేని విలువను సైతం వినియోగదారులకు అందిస్తున్నాం’’ అని అన్నారు.