గ్వాలియర్: జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గురించి వినే ఉంటారు. అలాంటి గాడ్సే గురించి ఇప్పటి యువతకు తెలియజేయాలని హిందూ మహాసభ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జ్ఞానశాలను ఏర్పాటు చేస్తోంది. అఖండ భారత్ విభజన, మహారాణా ప్రతాప్తోపాటు నాథూరామ్ గాడ్సే లాంటి మరికొందరి గురించి యువతకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. గాడ్సే దేశభక్తిని యువతకు చేరవేయడమే ధ్యేయంగా దీన్ని స్థాపించారు.
ప్రజల్లో దేశభక్తిని రగిలించడానికి గాడ్సే చేసిన కృషిని యువతకు వివరించనున్నామని హిందూ మహాసభ పేర్కొంది. ‘దేశ విభజన గురించి పలు రకాల సమాచారాన్ని నాథూరామ్ గాడ్సే జ్ఞానశాల ప్రజలకు తెలియజేస్తుంది. దీంతోపాటు గురు గోవింద్ సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్ లాంటి జాతి గర్వించే వారి వీర గాథలను ప్రజలకు చేరవేస్తుంది’ అని హిందూ మహాసభ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జైవీర్ భరద్వాజ్ తెలిపారు.
