న్యూఢిల్లీ: సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి చిన్న మొత్తాల పథకాల్లో పొదుపు చేస్తున్న వారికి గుడ్న్యూస్! ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్లపై 2023 జనవరి–మార్చి క్వార్టర్కు వడ్డీరేట్లను పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పథకాన్ని బట్టి వడ్డీని 20 నుంచి 110 బేసిస్ పాయింట్లు (0.20%–1.10%) పెంచారు. అంటే ఇక నుంచి నాలుగు శాతం నుంచి 7.6 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. చిన్న మొత్తాల పథకాలపై వడ్డీరేట్లు ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే మార్కెట్ రాబడులను బట్టి ఉంటాయి. వీటిని 0–100 బేసిస్ పాయింట్లలో లెక్కిస్తారు. అన్నిసార్లూ మార్కెట్ రాబడులను బట్టి రేట్లను నిర్ణయించకపోవచ్చు. కేంద్రం చివరగా ఈ ఏడాది అక్టోబరు–-డిసెంబరు క్వార్టర్లో వడ్డీరేట్లను 10–30 బేసిస్ పాయింట్లను పెంచింది.
అంతకుముందు వరుసగా తొమ్మిది క్వార్టర్లలో చిన్న మొత్తాల పథకాలపై వడ్డీరేట్లను మార్చలేదు. గవర్నమెంటు సెక్యూరిటీలపై రాబడులు తగ్గినప్పటికీ వడ్డీరేట్లను మాత్రం పెంచింది. ఈ ఏడాది రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్లను ఏప్రిల్ నుంచి 225 బేసిస్ పాయింట్లు పెంచింది. ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులు కూడా లెండింగ్, డిపాజిట్ రేట్లను పెంచాయి. గవర్నమెంటు బాండ్ల రాబడులు బాగా పెరుగుతున్నాయని ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన మానిటరీ పాలసీ రిపోర్టులో పేర్కొంది. ఐదేళ్ల గవర్నమెంట్ బాండ్లపై రాబడి 15 బేసిస్ పాయింట్లు పెరగగా, పదేళ్ల బాండ్లపై పది బేసిస్ పాయింట్లు పెరిగాయి. 2018 నుంచి బ్యాంకు వడ్డీరేట్లతో పోలిస్తే చిన్న మొత్తాల పథకాలపై వడ్డీ ఎక్కువగా ఉంటోందని ఆర్బీఐ
పేర్కొంది.
