న్యూఢిల్లీ: తమ కస్టమర్లకు ఈవీ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యాలను అందించేందుకు జియో–బీపీతో ఎలక్ట్రిక్ టూవీలర్లను తయారు చేస్తున్న హీరో ఎలక్ట్రిక్ పార్టనర్షిప్ కుదుర్చుకుంది. ఈ పార్టనర్షిప్ ద్వారా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొన్న కస్టమర్లు జియో–బీపీ ఛార్జింగ్ స్టేషన్లను వాడుకోవడానికి వీలుంటుంది. తమ, జియో–బీపీ యాప్ల ద్వారా కస్టమర్ల ఎక్స్పీరియెన్స్ను మెరుగుపరుస్తున్నామని హీరో ఎలక్ట్రిక్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. దీంతో పాటు ఇరు కంపెనీలు గ్లోబల్గా ఉన్న ఎలక్ట్రిఫికేషన్ గురించి తెలుసుకొని, లోకల్ మార్కెట్కు తగ్గట్టు ఈ టెక్నాలజీని వాడుతున్నాయని వివరించింది.
ముకేశ్ అంబానీ రిలయన్స్కు, బ్రిటిష్ ఆయిల్ కంపెనీ బీపీకి మధ్య జాయింట్ వెంచర్గా ఏర్పడిన జియో–బీపీ దేశంలో ఛార్జింగ్ స్టేషన్లను, బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ కంపెనీ జియో–బీపీ పల్స్ బ్రాండ్ కింద ఛార్జింగ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తోంది. కస్టమర్లు జియో–బీపీ యాప్ ద్వారా తమకు దగ్గర్లోని కంపెనీ ఛార్జింగ్ స్టేషన్ను గుర్తించొచ్చు. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్కు దేశం మొత్తం మీద 750 సేల్స్ అండ్ సర్వీస్ అవుట్ లెట్లు ఉన్నాయి.
