రోజూ ఉపయోగించే టూత్ పేస్టుల్లో ఉండే ట్రైక్లోసాన్ అనే రసాయనిక పదార్థం దుష్ప్రభావం చూపుతుందని IIT హైదరాబాద్ నిపుణులు అంటున్నారు. టూత్ పేస్టుల్లో హానికారక పదార్థాలపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందులో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. తమ ఉత్పత్తులపై ప్రభావం చూపించే సూక్ష్మక్రిములను సంహరించేందుకు పలు కంపెనీలు ట్రైక్లోసాన్ కలుపుతుంటాయి. దీంతో ఉత్పత్తుల కాలపరిమితి పెరుగుతుంది.
టూత్ పేస్టుల్లో ట్రైక్లోసాన్ ఎంత కలపాలన్న దానికి ఓ నిర్దిష్టమైన పరిమితి ఉంది. ఆ పరిమితి కంటే 500 రెట్లు తక్కువగా ట్రైక్లోసాన్ కలిపినా అది మనుషుల నాడీ వ్యవస్థలను దెబ్బతీస్తుందని ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు గుర్తించారు. ఎంతో స్వల్ప మోతాదులో అయితే ట్రైక్లోసాన్ ను మానవులు తట్టుకోగలరని, అయితే నిత్యం వాడే వస్తువుల్లో ఈ కెమికల్ ఉండడంతో ఎంతో ప్రమాదకరంగా మారుతుందని IIT హైదరాబాద్ బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్లు తెలిపారు.
మానవ వ్యాధి నిరోధక శక్తిని పోలివుండే ఇమ్యూనిటీని కలిగివున్న జీబ్రాఫిష్ పై ఈ పరిశోధనలు నిర్వహించారు. టూత్ పేస్టులోని ట్రైక్లోసాన్ ఆ చేపలోని న్యూరాన్లపై తీవ్ర ప్రభావం చూపినట్టు తెలిసింది.
