- డిస్కౌంట్లు దొరికే ఛాన్స్
- గోల్డ్కు ఈ ఏడాది కీలకం
- దేశంలో 30 వేల మందే హాల్మార్కింగ్ జ్యూయల్లరీ అమ్మకం
- 2021 నుంచి హాల్మార్కింగ్ తప్పనిసరి
- నాన్ హాల్మార్క్ స్టాక్ క్లియరెన్స్ సేల్ ఆఫర్లు
కోల్కతా:
గోల్డ్ జ్యూయల్లరీకి 2021 జనవరి 15 నుంచి హాల్మార్కింగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకున్న సంగతి తెలిసిందే. హాల్మార్కింగ్లోకి మారడానికి ఇంకా వన్ ఇయర్ సమయం ఇచ్చింది. ఈ ఏడాదిలో మార్కెట్లో ఎన్నో మార్పులు చోటు చేసుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బులియన్ డీలర్స్, జ్యూయల్లర్స్ ఇప్పటికే తమ వద్దనున్న నాన్ హాల్మార్కెడ్ జ్యూయల్లరీ స్టాక్ను క్లియర్ చేసుకునేందుకు, జీరో మేకింగ్ ఛార్జస్ను ఆఫర్ చేయొచ్చని బులియన్ నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ మేకింగ్ ఛార్జీలను వదులుకోకపోతే, అదే జ్యూయల్లరీని కరిగించి, హాల్మార్క్ చేయాల్సి వస్తుందన్నారు. ‘ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఏడాది కాలం దగ్గర పడుతున్నా కొద్దీ.. నాన్ హాల్మార్కెడ్ జ్యూయల్లరీపై డిస్కౌంట్లను కూడా ఎక్కువగా బంగారం దుకాణాలు ఆఫర్ చేస్తాయి. ఇవి నాన్ హాల్మార్కెడ్ జ్యూయల్లర్స్కు భారీ ఎత్తున నష్టాలను మిగల్చనున్నాయి’ అని ఇండియా బులియన్ అండ్ జ్యూయల్లర్స్ అసోసియేషన్(ఐబీజేఏ) నేషనల్ సెక్రటరీ సురేంద్ర మెహతా చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 15న ప్రభుత్వం హాల్మార్కింగ్పై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) వద్ద రిజిస్టర్ చేసుకోవడానికి, నాన్ హాల్మార్కింగ్ స్టాక్స్ను క్లియర్ చేసుకునేందుకు ఏడాది సమయం ఇవ్వనున్నట్టు తెలిపింది. బీఐఎస్ గోల్డ్ జ్యూయల్లరీకి మూడు రకాల గ్రేడ్స్ ఇస్తుంది. అవి 14, 18, 22 క్యారెట్ల గ్రేడ్స్.
గ్రామాల్లోనే నాన్ హాల్మార్కెడ్ జ్యూయల్లరీ అమ్మకాలు ఎక్కువ..
చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నాన్ హాల్మార్కెడ్ జ్యూయల్లరీనే ఎక్కువగా విక్రయిస్తారు. గ్రామాల్లో చాలా మందికి హాల్మార్కింగ్ గురించి, దాని ప్రయోజనాల గురించి తెలియదు. ఇవేమీ చూసుకోకుండానే.. బంగారం కొనేస్తుంటారు. ప్రస్తుతం హాల్మార్కింగ్ జ్యూయల్లరీ అమ్మేందుకు బీఐఎస్ నుంచి లైసెన్స్ పొందిన జ్యూయల్లర్స్ దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ఉన్నారు. వారిలో కేవలం 30 వేల మంది మాత్రమే హాల్మార్కింగ్ జ్యూయల్లర్స్ను విక్రయిస్తున్నారు. ‘2019 ఆర్థిక సంవత్సరంలో దేశంలో వెయ్యి టన్నుల గోల్డ్ వినియోగం జరిగింది. దానిలో 450 టన్నులు మాత్రమే హాల్మార్కింగ్ జ్యూయల్లరీ. ప్రస్తుత ఏడాది ఇది గతేడాది కంటే తక్కువ లేదా ఎక్కువ ఉండొచ్చు’ అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ హాల్మార్కింగ్ సెంటర్స్ మాజీ ప్రెసిడెంట్ హార్షద్ అజ్మేరా అన్నారు.
హాల్మార్కింగ్ అంటే ఏమిటి…?
బీఐఎస్ హాల్మార్క్ అనేది.. ఇండియాలో విక్రయించే గోల్డ్, సిల్వర్ జ్యూయల్లరీకి ఇస్తోన్న హాల్మార్కింగ్ సిస్టమ్. ఇది ఆ విలువైన మెటల్ స్వచ్ఛతను కొలుస్తోంది. ఇండియాలో గోల్డ్ జ్యూయల్లరీకి హాల్మార్కింగ్ సిస్టమ్ను 2000 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. అప్పుడది వాలంటరీ స్కీమ్ మాత్రమే. కానీ హాల్మార్కెడ్ గోల్డ్నే అమ్మేందుకు జ్యూయల్లర్స్ను ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ వస్తోంది. హాల్మార్కింగ్ జ్యూయల్లరీని అమ్మేందుకు ప్రభుత్వం పలు చర్యలు కూడా తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్యూయల్లర్స్కు ఫీజులు తగ్గించింది. దీనిపై అవగాహన కల్పించడానికి బీఐఎస్ పలు ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ను కూడా నిర్వహించింది. ప్రస్తుతం దీన్ని తప్పనిసరి చేసింది.
హాల్మార్కింగ్ ప్రయోజనాలు..
మార్కెట్లో, కన్జూమర్లలో తమపై నమ్మకాన్ని చూరగొనడానికి జ్యూయల్లర్స్కు హాల్మార్కింగ్ గోల్డ్ విక్రయం ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైనా బంగారపు ఆభరణాన్ని చూడగానే దాని కచ్చితమైన నాణ్యతను, స్వచ్ఛతను అంచనావేయలేం. దీని కోసం మనం ఒక నిపుణుడి సలహా అవసరం. అలాంటి సమయాల్లో దాని అసలు విలువ తెలుసుకోకుండానే.. ఎక్కువ మొత్తాన్ని చెల్లించి గోల్డ్ జ్యూయల్లరీని కొంటున్నారు చాలామంది. ఒకవేళ బీఐఎస్ హాల్మార్క్కు సంబంధించిన గ్రేడ్స్ ఉంటే, ఆ ఐటమ్ స్వచ్ఛత ఎంతో తేలికగా తెలుసుకోవచ్చు. హాల్మార్కింగ్ ఉన్న గోల్డ్ను తేలికగా మళ్లీ అమ్మొచ్చు లేదా రీసైక్లింగ్ చేసుకోవచ్చు కూడా. హాల్మార్కింగ్ ఉన్న గోల్డ్ వల్ల కస్టమర్లు ఎక్కడా కూడా నష్టపోవడానికి వీలుండదు. ఎక్కడైన జ్యూయల్లర్స్ మోసం చేశారని తెలిస్తే.. వారిపై చర్యలు కూడా ఉంటాయి. గోల్డ్ వినియోగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఇండియా ఉంది. అందుకే ఈ వాలంటరీ స్కీమ్ను కాస్త.. ప్రభుత్వం తాజాగా తప్పనిసరి చేసింది.

