అహ్మదాబాద్: భర్త తనను కొడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించి గృహ హింస కేసుపెట్టిందో మహిళ.. కోర్టు ఆదేశాలతో ఆ భర్త జైలుపాలయ్యాడు. దీంతో మళ్లీ ఆ భార్యే జామీను ఇచ్చి బయటకు తీసుకొచ్చింది. ఒక సారి, రెండు సార్లు కాదు.. పదేండ్లలో ఏడుసార్లు ఇలాగే జరిగింది. భర్త కొట్టడంతోనో, నెలనెలా పంపాల్సిన సొమ్ము పంపకపోతేనో ఆ భార్య పోలీస్ స్టేషన్కు వెళ్లడం, వాళ్లు వచ్చి సదరు భర్తను జైలుకు పంపించడం.. పదేండ్లుగా ఇలాగే జరుగుతోందట. గుజరాత్లోని మెహసానా జిల్లాలో కాడి టౌన్లో నివసించే ప్రేమ్చంద్, సోను దంపతుల వింత కథ ఇది.
గృహహింస కేసు..
ప్రేమ్చంద్, సోను దంపతులకు 2001లో పెండ్లి జరిగింది. కొన్నాళ్లు బాగానే సాగిన వాళ్ల కాపురంలో 2014 నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఏడాది సహనంతో భరించిన సోను.. 2015లో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు గృహహింస కేసు పెట్టి ప్రేమ్ చంద్ను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో తాము కలిసి ఉండలేమని చెప్పడంతో ఇద్దరినీ విడివిడిగా ఉండాలని జడ్జి సూచించారు. సోను పోషణ నిమిత్తం నెలకు రూ.2 వేలు పంపించాలని ప్రేమ్చంద్ను ఆదేశించారు. నెలనెలా ఆ మొత్తం ఇవ్వకపోతే జైలుకు పంపించాలంటూ పోలీసులకు ఆదేశించారు. కూలీ అయిన ప్రేమ్చంద్ భార్యకు డబ్బులు ఇవ్వలేక 2016 నుంచి 2020 వరకు పలుమార్లు జైలుకు వెళ్లాడు.
పర్సు, వాచీ విషయంలో గొడవ
ఒకసారి ప్రేమ్చంద్ 5 నెలలు లోపలే ఉన్నా డు. మళ్లీ సోను కల్పించుకుని జామీను ఇచ్చి విడి పించింది. కొన్ని రోజులు కలిసి ఉన్నాక మళ్లీ గొడవ కావడంతో సోను మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రేమ్ చంద్ మళ్లీ జైలుకెళ్లాడు. సోను మరోమారు జామీను ఇచ్చి ప్రేమ్ చంద్ను విడిపించింది. ఇలా ఈ పదేండ్ల కాలంలో ఏడుసార్లు ప్రేమ్చంద్ జైలుకు వెళ్ల గా.. సోనూయే విడిపించి బయటకు తీసుకొచ్చింది. ఈ నెల 4న కూడా అదేవిధంగా ప్రేమ్ చంద్ను విడిపించింది. ఇద్దరూ ఇంటికి వెళ్లాక తన పర్సు, వాచీ కనిపించడంలేదని సోనుతో ప్రేమ్చంద్ గొడవ పడ్డాడు. ఇదికాస్తా ముదిరి ఇద్దరూ కొట్టుకున్నారు. ఆపై తన భార్య సోను, కొడుకుతో కలిసి తనకు హాని చేయాలని ప్రయత్నిస్తోందని ప్రేమ్చంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకపై భార్యతో కలిసి ఉండేది లేదని తన తల్లి ఇంటికి వెళ్లిపోయాడు.
