భారత్ బంద్ కు మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికల్లో వాళ్ల పార్టీ మేనిఫెస్టోలోనూ ఈ చట్టాలను పేర్కొందని గుర్తు చేశారు. ఏళ్ల తరబడిగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అన్నారు.
గుజరాత్లోని మెహసానాలో నర్మదా ఆధారిత నీటి సరఫరా పథకానికి శిలాఫలకం వేసిన సందర్భంగా రూపానీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. అయినా ఉద్యమాల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. నేను రాహుల్ గాంధీని ఓ విషయం అడగదలుచుకున్నాను. కొత్తిమీరకు,మెంతికి తేడా ఏంటి. తెలిస్తే ఆయన సమాధానం చెప్పాలి. ఆయన తెలివేంటో అందరికీ తెలిసిందే అంటూ రూపానీ రాహుల్ను విమర్శించారు
