
చలికాలం రాకమునుపే వొణుకు వట్టే సలివెడ్తంది. ఎండాకాలం రాకమునుపే భానుడు భగ్గుమంటున్నడు. ఇగ వానలకైతే లెక్కనేలేదు. ఎప్పుడు పడితే అప్పుడే పడుతున్నయ్. ఇట్ల వాతావరణంల వచ్చిన మార్పులన్నీ కలిసి రైతును ఆగమాగం చేస్తున్నయ్. ఇట్లాంటి మార్పులకు కారణం గ్లోబల్ వార్మింగ్. దీనివల్ల భూమి వేడెక్కుతుంది. దాంతో భూమినే నమ్ముకున్న రైతు నష్టాల పాలైతుండు. మామిడి పూత రాలిపోతున్నది. వాన నీళ్లల్ల వరి మునుగుతున్నది మక్కలు ముక్కిపోతున్నయ్. అడివిలో మస్తుగ దొరికే పండ్లు, పూలు తగ్గిపోతున్నయ్. అసలు భూమి వేడెక్కడానికి, పంటలు పండకపోవడానికి మధ్య లింక్ ఏముంటది అంటరా? ‘‘రోని(రోహిణి)ల రోల్లు పగిలె ఎండలు కొడ్తయ్.. మిర్గం(మృగశిర)ల మూడు లోకాలు సల్లవడ్తయ్” అంటుంటరు. అందుకే మృగశిరలనే సాగు పనులు మొదలుపెడుతుంటరు రైతులు. తాత ముత్తాల నాటి నుంచి ఇలాగే కార్తెలను బట్టి సాగు చేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడు వానలు పడతాయో.. ఎప్పుడు ఎండలు కాస్తాయో తెలియడం లేదు. అవసరం లేకున్నా వర్షాలు కురుస్తున్నయ్. అవసరం ఉన్నప్పుడు చినుకు చుక్క పడడం లేదు. ఇలాంటి పరిస్థితులకు కారణమేంటి? అనే ప్రశ్న తలెత్తితే.. కచ్చితంగా మనుషులు చేస్తున్న తప్పులే కారణం అంటున్నారు సైంటిస్ట్లు. మనుషులు చేస్తున్న కొన్ని తప్పుల వల్ల వాతావరణం కలుషితం అవుతోంది. అదికాస్తా గ్లోబల్ వార్మింగ్ అంటే... భూమి వేడెక్కడాన్ని పెంచుతోంది. దాంతో వాతావరణంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచమంతా ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ పంటల దిగుబడులు తగ్గడానికి కారణం అవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే.. ముందుముందు మనిషికి తిండి దొరకడమే కష్టమైపోతుంది అంటున్నారు సైంటిస్ట్లు.
గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓ చోట వరదలు.. మరో చోట ఎండలు.. ఇంకో చోట అడవులు కాలిపోవడం.. లాంటివి మన కళ్ల ముందు కనపడుతూనే ఉన్నాయి. ఇవన్నీ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ వ్యవసాయం మీద పడుతోంది. రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మార్పులు అంటే... సగటు ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం, అధిక లేదా అల్ప వర్షపాతం, వేడి, చలిగాలుల్లాంటివి. ఇవన్నీ కలిసి పంటల దిగుబడులను తగ్గిస్తున్నాయి. వీటివల్ల కొత్త తెగుళ్లు వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న తెగుళ్ల శక్తి పెరుగుతుంది. వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ కూడా పంట దిగుబడుల మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. పంటల దిగుబడితోపాటు పోషకాల నాణ్యత కూడా తగ్గుతోంది. అయితే.. క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. 2019లో వచ్చిన వాతావరణ మార్పుల వల్ల మిలియన్ల మందికి తిండి కరువైంది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి దశాబ్దానికి రెండు నుంచి ఆరు శాతం పంటల దిగుబడి తగ్గుతోంది. దీనివల్ల తిండి ఖర్చు బాగా పెరుగుతుంది. 2019తో పోలిస్తే.. 2050 నాటికి తిండి ఖర్చు 80 శాతం పెరుగుతుందనేది ఒక అంచనా. వాతావరణంలో మార్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ.. గడిచిన ఈ కొన్నేండ్లుగా ఆ మార్పులు మరీ ఎక్కువయ్యాయి. ఈ మార్పుల వల్ల భూమ్మీద ప్రతి జీవి మీద పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా ఆదాయాలు తక్కువగా ఉండే దేశాల మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి దేశాల్లో ఎక్కువమంది వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి బతుకుతుంటారు. అలాంటి వాళ్లు ఇప్పటికే వాతావరణంలో మార్పుల వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు.
సంబంధం ఏంటి?
వాతావరణ మార్పులకి, వ్యవసాయానికి మధ్య సంబంధం విడదీయలేనిది. ముఖ్యంగా ఉష్ణోగ్రతల్లోని మార్పులే పంటల దిగుబడి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. రెండు దశాబ్దాలుగా అంటే.. 1800ల సంవత్సరం నుంచే టెంపరేచర్లు బాగా పెరిగిపోతున్నాయి. అయితే.. దీనికి ముఖ్యకారణం.. పరిశ్రమలు, మోటార్ వెహికల్స్ పెరగడమే అంటున్నారు సైంటిస్ట్లు. అంతెందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయకముందు ఉన్న టెంపరేచర్తో పోలిస్తే.. భూమి ఉష్ణోగ్రత1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. పరిశ్రమల నుంచి వెలువడే గ్రీన్హౌస్ వాయువులే టెంపరేచర్లు పెరగడానికి కారణం.1750లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ లెవల్స్ 30 శాతం పెరిగాయి. గత 8 లక్షల ఏండ్లలో వాతావరణంలో ఇప్పుడున్నంత కార్బన్ డై ఆక్సైడ్ ఎప్పుడూ లేదు.
ఎందుకు వేడెక్కుతోంది
వాతావరణం మారేందుకు ఎక్కువ కారణమయ్యేవి ఫాజిల్స్ (శిలాజ ఇంధనాలు). ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మూడొంతులకు పైగా ఎమిషన్స్ (ఉద్గారాలు) వీటి నుంచే వస్తున్నాయి. పెట్రోలియం, బొగ్గు, గ్యాస్ని మండించడం వల్ల పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్.. లాంటి గ్రీన్హౌస్ వాయువులు విడుదలవుతాయి. ఇవి భూ వాతావరణంలో చేరి ఉపరితలానికి దగ్గరగా ఉండి వేడిని పెంచుతాయి. సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే వేడిలో కొంత భూమిపైనే ఉండిపోతుంది. మిగతాది పైకి వెళ్లిపోతుంది. కానీ.. అలా వెళ్లాల్సిన వేడిని వాతావరణంలో ఉన్న గ్రీన్ హౌజ్ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి పంపుతున్నాయి. దాంతో వాతావరణం, భూ ఉపరితలం వేడెక్కుతున్నాయి. ఇలా గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎంతో మంది రైతులు తీవ్ర నష్టాలు చూడాల్సి వచ్చింది.
సీజన్లలో మార్పులు
రైతుల జీవనోపాధికి కావాల్సింది ఆరోగ్యకరమైన భూమి, నమ్మదగిన వాతావరణం మాత్రమే. కానీ.. ఇప్పుడు ఈ రెండూ లేవు. గ్లోబల్ వార్మింగ్ వల్ల సీజన్లలో మార్పులు వస్తున్నాయి. అధిక వర్షపాతం, తరచుగా వరదలు రావడం, చాలా రోజులు పొడి వాతావరణం ఉండడం లాంటి పరిస్థితులు కరువుకు దారితీస్తున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల రోజులో పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా తేడాలు ఉంటున్నాయి. దీనివల్ల కొన్ని రకాల పంటల దిగుబడి బాగా తగ్గిపోతోంది. పోయినేడు మామిడి దిగుబడి తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. రాత్రి పూట ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నా, పగలు తక్కువగా ఉన్నా కొన్ని రకాల చెట్ల పిందెలు రాలిపోతాయి. దాంతో కాత తక్కువగా వస్తుంది. ఉష్ణోగ్రతల్లో మార్పులు ఎక్కువగా ఉంటే ఫలదీకరణ సరిగా జరగదు. దాంతో దిగుబడి తగ్గుతుంది. పైగా పూత ఆలస్యంగా రావడం, లేదంటే తొందరగా రావడం లాంటివి జరుగుతాయి. ఇలా జరిగినా నష్టాలు తప్పవు. ప్రపంచంలో వ్యవసాయానికి పనికొచ్చే మొక్క జాతుల్లో దాదాపు70 శాతం ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉదాహరణకు... పోయినేడు మామిడి పూత ఫిబ్రవరిలో వచ్చింది. కానీ.. అప్పటికే టెంపరేచర్లు పెరిగాయి. దాంతో మగ పూత ఎక్కువగా వచ్చింది. ఆడ పూతలో కూడా ఫలదీకరణం ఎక్కువగా జరగలేదు. ఎందుకంటే.. కీలాగ్రం మీద కాస్త జిగటగా ఉంటేనే పుప్పొడి పడినప్పుడు అతుక్కుని ఫలదీకరణ జరుగుతుంది. కానీ.. పూత టైంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వేడికి ఆ జిగురు ఎండిపోయి పుప్పొడి అతుక్కోలేదు. దాంతో ఫలదీకరణ తక్కువగా జరిగి దిగుబడి తగ్గింది. ఇలా సరైన టైంలో పూత రాకపోవడం, వచ్చినా అకాల వర్షాల వల్ల రాలిపోవడం జరుగుతోంది. ఈ పరిస్థితి నాలుగైదేండ్లుగా ఉంటుండడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల రైతులు మామిడి పంటను తొలగిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ మామిడి మీదనే కాదు... మిగతా పంటల మీద కూడా ఉంది.
వేడి గాలులు
గ్లోబల్ వార్మింగ్ వల్ల వేడిగాలులు వీస్తాయి. దీనివల్ల ప్రతిసారి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వేడిగాలులు పంటలు, పాడి పశువుల మీద ప్రభావం చూపిస్తాయి. మన దేశంలో ప్రతిసారి మార్చిలో వేడిగాలులు వచ్చి, ఏప్రిల్, మే నెలల్లో బాగా పెరుగుతాయి. కానీ.. ఈ సారి వేడి గాలులు ఫిబ్రవరిలోనే మొదలయ్యాయి. వేడి వల్ల పండ్ల దిగుబడి బాగా తగ్గుతోంది. దాదాపు అన్ని రకాల పండ్లు సైజులో చిన్నగా ఉంటున్నాయి. మనుషుల్లాగే పండ్లు, కూరగాయలకు కూడా వడదెబ్బ తగులుతుందన్నమాట. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పోయినేడు వేడిగాలుల వల్ల గోధుమల దిగుబడి బాగా తగ్గింది. గింజలు ఏర్పడే టైంలో మార్చిలో బాగా వేడి పెరిగి గింజల పరిమాణం, బరువు తగ్గాయి. దాంతో రైతులు నష్టాలు చూడాల్సి వచ్చింది. ఈసారి కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో మామిడి కాయలు పక్వానికి రాకముందే కోస్తున్నారు. ఈ వేడి ఉష్ణోగ్రతల వల్ల పూల మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. పరాగసంపర్కం తక్కువగా జరుగుతోంది.
భారత వాతావరణ శాఖ(ఇండియన్ మెటియోరాలాజికల్ డిపార్ట్మెంట్)
ఈసారి కూడా గుజరాత్, రాజస్తాన్, కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఫిబ్రవరి 20న హెచ్చరించింది. మరుసటి రోజే పంజాబ్, హర్యానాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. సాధారణం కంటే నాలుగు నుంచి పదకొండు డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపింది. పైగా పగటి పూట ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. వీటి వల్ల గోధుమ పంటపై ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరించింది. పంటకు కావాల్సిన దానికంటే ఎక్కువ టెంపరేచర్లు ఉంటే.. మొక్కపెరుగుదల ఆగిపోతుంది. దిగుబడి సరిగా రాదు.
వర్షాలు
గ్లోబల్ వార్మింగ్ వల్ల తలెత్తుతున్న సమస్యల్లో అకాల వర్షం కూడా ఒకటి. పంటలకు నీళ్లు పెద్దగా అవసరం లేని టైంలో పంటలు నీట మునిగేంత వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మార్చి, ఏప్రిల్లో కురిసిన అకాల వర్షాలకు కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. మన దగ్గరే కాదు.. ప్రపంచమంతటా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. మన దేశంలో 2021–22, 2022–23 వరుస సంవత్సరాల్లోనే వాతావరణంలో చాలా రకాల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా గోధుమ పంట విషయంలో ఈ రెండు సంవత్సరాల్లో రెండు రకాల రబీ సీజన్లు చూశారు రైతులు. 2021–22 సీజన్ చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబరు 2021 నుండి జనవరి 2022 వరకు ప్రతి నెలలో సాధారణం సగటు కంటే ఎక్కువ వర్షం కురిసింది. దీనివల్ల మొక్కలు బాగా పెరిగాయి. కానీ. మార్చి వచ్చేసరికి టెంపరేచర్లు బాగా పెరిగాయి. దాంతో దిగుబడి తగ్గింది.
2022 - 23 కాస్త భిన్నం
2021–22లో వరుసగా ఐదు నెలలు మిగులు వర్షాలు కురిసి, చివర్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. చలికాలంలో వాతావరణం పొడిగా ఉంది. నవంబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు నాలుగు నెలలు లోటు వర్షపాతం నమోదైంది. ఫిబ్రవరి 2023లో సాధారణం కంటే 68.3% తక్కువ వర్షపాతం నమోదైంది. 2022 మార్చిలో ఉన్నంత వేడి ఈసారి ఫిబ్రవరిలోనే ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగి పంటలకు నష్టం జరుగుతుందనే బాధలో ఉండగానే వడగండ్ల వానలు చాలా ప్రాంతాల్లో రైతులను ముంచేశాయి. గతంలో మార్చిలో అప్పుడప్పుడు చిరు జల్లులు మాత్రమే పడేవి. ఈసారి మాత్రం వానలు బాగా కురిశాయి.
పోషకాలు తగ్గుతాయా?
వాతావరణ మార్పు, వ్యవసాయం, పోషకాహారం... ఈ మూడింటికీ ఒకదానితో మరొకదానికి సంబంధం ఉంది. వాతావరణంలో వచ్చే మార్పులు పంట దిగుబడినే కాదు.. ఆహార వైవిధ్యాన్ని, ఫుడ్ క్వాలిటీని, న్యూట్రియెంట్ డెన్సిటీని తగ్గిస్తాయి. ఫుడ్ న్యూట్రిషన్ అనేది బయో కెమికల్, ఫిజియోలాజికల్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. అయినా.. వాతావరణ మార్పులు ఫుడ్ న్యూట్రియెంట్స్ని తగ్గిస్తాయనేదానికి ఆధారాలు ఉన్నాయి. మెక్డైర్మిడ్, వైబ్రో అనే సైంటిస్ట్ 2019లో చేసిన ఒక స్టడీలో ఫుడ్ న్యూట్రియెంట్స్ మీద వాతావరణ మార్పుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. ముఖ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పంట, నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 2022లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం... వాతావరణ మార్పు వల్ల పోషకాహార లోపం, సూక్ష్మపోషకాల లోపం తలెత్తుతుంది. అందువల్ల 2050 నాటికి ప్రపంచంలోని10 శాతం ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది.
అస్థిర వర్షపాతం ధాన్యాల పోషకాల నాణ్యతపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే వాతావరణంలో పెరిగిన కార్బన్ డై ఆక్సైడ్ మొక్కల్లో ప్రొటీన్ సంశ్లేషణకు అవసరమైన ప్రక్రియలకు ఆటంకం కలిగిస్తుంది. దాంతో ధాన్యాల పోషక నాణ్యతలో క్షీణత వస్తుంది. ఇలాంటి ఫుడ్ తింటే కడుపు నిండుతుంది. కానీ.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. ముఖ్యంగా ఐరన్, జింక్ లాంటి పోషకాలు బాగా తగ్గుతాయి. యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియాల్లో చేసిన కొన్ని ప్రయోగాల్లో తెలిసింది ఏంటంటే.. గోధుమ, వరి, మొక్కజొన్న, బఠాణీ, సోయా పంటలు కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కుగా ఉన్న ప్రాంతాల్లో పండించినప్పుడు ధాన్యంలో ఐరన్, జింక్ ఉండాల్సిన స్థాయికంటే చాలా తక్కువగా ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ని తగ్గించకపోతే.. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు140 మిలియన్ల మంది జింక్ లోపంతో బాధపడతారు. దాదాపు150 మిలియన్ల మంది ప్రోటీన్ లోపంతో బాధపడే అవకాశం ఉంది. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి అంటే.. గ్లోబల్ వార్మింగ్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తూనే బెస్ట్ క్వాలిటీ ధాన్యాలను పండించే మార్గాలను కనుక్కోవాలి. ముఖ్యంగా ఐరన్, జింక్ ఎక్కువగా ఉండే రకాలను డెవలప్ చేసి పండించాలి.
ఎక్కువ ప్రమాదం
ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ దక్షిణాసియాలో ఆహార, వాణిజ్య పంటల దిగుబడి తగ్గుతోంది. పంటల దిగుబడి తగ్గుతుండడం వల్ల ఆహార కొరత ఏర్పడుతోంది. దేశ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల భవిష్యత్తులో వరి, గోధుమ దిగుబడులు విపరీతంగా తగ్గే ప్రమాదం ఉందని సైంటిస్ట్లు చెప్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో నీటి లభ్యత కూడా తగ్గుతుంది. ఈ ఎఫెక్ట్ మొక్కజొన్న లాంటి పంటల మీద కూడా ఉంటుంది. 2030 నాటికి ప్రపంచంలో మొక్కజొన్న దిగుబడి 24 శాతం వరకు తగ్గుతుందనేది ఒక అంచనా. చెరకు లాంటి పంటల దిగుబడి కూడా తగ్గుతుందట. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటలో చక్కెర కంటెంట్ తగ్గుతుంది. ప్రపంచంలో చెరకును ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో మన దేశం ఒకటి. ఈ పరిశ్రమ దేశవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మందికి జీవనోపాధిని ఇస్తోంది. ఎండలు పెరిగితే వాళ్లందరికీ నష్టాలు తప్పవు.
పేదరికం
వాతావరణ మార్పులు ఎక్కువైతే రైతుల జీవనోపాధిపై చాలా ఎఫెక్ట్ పడుతుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో వాతావరణ మార్పుల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని స్టడీలు చెప్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. వాతావరణంలో మార్పులు వేగంగా పెరిగితే.. పంట దిగుబడి తగ్గి2030 నాటికి ఆఫ్రికాలో 43 మిలియన్ల మంది ప్రజలు పేదలుగా మారతారని కొన్ని స్టడీలు చెప్తున్నాయి.
వలసలు
ప్రపంచవ్యాప్తంగా వలసలకు వాతావరణ మార్పులు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలే ఎక్కువగా వలస వెళ్తున్నాయి. కొత్త పని కోసం తమ పొలాలను విడిచిపెట్టాల్సి వస్తుంది. 2021లో రైతులకు వాతావరణం సహకరించకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 23 మిలియన్ల మంది వలసలు వెళ్లారు.
పాల ఉత్పత్తి
వేడి బాగా పెరగడం వల్ల పాడి పశువుల పెరుగుదల, పునరుత్పత్తి తగ్గుతుంది. వానలు సరిగ్గా కురవకపోతే గడ్డి దొరకదు. దాంతో పశువులు తిండికోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
షుగర్ ఎక్కువైతే..
వాతావరణంలో మార్పుల వల్ల పంట తెగుళ్లు బాగా పెరుగుతాయని సైంటిస్ట్లు చెప్తున్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైన కార్బన్ డై ఆక్సైడ్ మొక్కల ఆకుల్లోని షుగర్ లెవల్స్ని పెంచుతుంది. నత్రజని కంటెంట్ను తగ్గిస్తుంది. దీనివల్ల అనేక రకాల కీటకాలు పంటను ఆశిస్తాయి. పైగా కీటకాల దాడి ఒకేసారి చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వాటిని అరికట్టడం రైతుల వల్ల కాదు. కార్బన్ డై ఆక్సైడ్ మొక్కల శరీరధర్మాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కార్బన్ డై ఆక్సైడ్ వల్ల ఆకుల్లో పేరుకుపోయే షుగర్స్, పిండి పదార్థాలను తినడానికి కీటకాలు ఎక్కువగా ఇష్టపడతాయి. పైగా ఆకుల్లో నత్రజని (నైట్రోజన్) తగ్గడం వల్ల కీటకాలు ఎక్కువ ఆకులు తింటాయి. ఎందుకంటే.. ఆకులు తిని బతికే కీటకాల శరీరంలో నత్రజని కీలకమైన మూలకం. కాబట్టి ఆకుల్లో నత్రజని తక్కువగా ఉన్నప్పుడు.. కీటకాలు వాటికి కావాల్సినంత నత్రజని సమకూరే వరకు ఆకుల్ని తింటూనే ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరగడం థర్మోఫిలిక్ శిలీంధ్రాలకు కూడా అనుకూలమే. తెగుళ్ల ఎఫెక్ట్ ఉత్తర, దక్షిణార్ధ గోళాలతో పోలిస్తే.. సమశీతోష్ణ జోన్లో ఉన్న ఇండియా లాంటి దేశాల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. వెచ్చగా ఉండే.. వాతావరణం వల్ల పురుగుమందుల ఎఫెక్ట్ కూడా బాగా తగ్గుతుంది. పైగా అధిక ఉష్ణోగ్రతలు తెగుళ్లు, వ్యాధుల ఇన్ఫెక్టివ్ స్టేజీలను, డ్యురేషన్ని మారుస్తుంటాయి. అందువల్ల టెంపరేచర్లు పెరగడం వల్ల ఏం జరుగుతుందనేది అంత ఈజీగా అంచనా వేయలేం. ఎలాంటి మార్పులు వస్తాయి? పురుగులు ఎంతకాలం ఉంటాయి? అనేది చెప్పలేం. ఉదాహరణకు.. ఈ మధ్య సబ్-సహారా ఆఫ్రికన్ దేశాల్లో ఫాల్ ఆర్మీవార్మ్(కత్తెర తెగులు) వ్యాపించింది. ఇది చాలా హానికరమైనది. ఈ తెగులు వాతావరణ మార్పుల వల్లే బలపడిందని సైంటిస్ట్లు చెప్పారు. ముఖ్యంగా మొక్కజొన్నకు ఇది భారీ నష్టం కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంటల్లో10–16 శాతం మేర కీటకాలు తింటున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగితే.. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వేడిగాలుల వల్ల కీటకాల జీవక్రియ రేటు, సంతానోత్పత్తి చక్రాల సంఖ్య బాగా పెరుగుతుంది. ఇది పంటలకు చాలా ప్రమాదం.
అందరికీ నష్టమే
వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయం మీద పడే ఎఫెక్ట్ వల్ల అందరికీ నష్టమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గుతాయి. దాంతో ధాన్యం ధరలు పెరుగుతాయి. అలా ఈ ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది. ముఖ్యంగా పేదల కొనుగోలు శక్తి తగ్గుతుంది. 2050 నాటికి తిండి ఖర్చు దాదాపు 80 శాతం పెరుగుతుందనేది ఒక అంచనా. తృణధాన్యాల ధరలు 29 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
::: దర్వాజ డెస్క్
సముద్ర మట్టం పెరిగితే..
గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కి ధృవాల్లో ఉన్న మంచు కరుగుతోంది. దాంతో ఆ నీళ్లు సముద్రాల్లో కలిసి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దాంతో చాలావరకు వ్యవసాయ భూమి కోల్పోవలసి వస్తోంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా లాంటి ప్రాంతాల్లో సముద్ర మట్టాలు పెరగడం వల్ల కోత, తీరప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఈ సమస్య ఇండియా, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు వియత్నాంలో మెకాంగ్ డెల్టా దక్షిణ ప్రాంతంలో రైతులు వరి పండిస్తారు. సముద్ర మట్టం ఒక మీటరు పెరిగితే.. కొన్ని చదరపు కిలోమీటర్ల మేర వరి పండించే భూమి సముద్రం పాలవుతుంది. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ఈ శతాబ్దం చివరినాటికి దాదాపు 20 కోట్ల మంది శరణార్థులు అవుతారనేది ఒక అంచనా. ముఖ్యంగా ఆసియా ఖండ ప్రజల మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. దాంతో పర్యావరణ వలసలు మొదలవుతాయి.
చల్లగాలులు
ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్స్(చల్లగాలులు) కూడా వస్తున్నాయి. వీటికి కూడా ఒక రకంగా గ్లోబల్ వార్మింగే కారణం. ఈ కోల్డ్ వేవ్స్ మనుషులకే కాదు పంటలకు కూడా ప్రమాదమే. యాసంగి పంట కోసం రెడీ చేసుకున్న వరి నారు చలి వల్ల చనిపోతుంటుంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ సీజన్లో చాలా తక్కువ టెంపరేచర్లు రికార్డ్ అవుతుంటాయి. రాత్రుళ్లు మంచు బాగా కురవడం వల్ల యాసంగి గోధుమ మొక్కల్లో కణాలు చీలిపోతాయి. దాని వల్ల దిగుబడి తగ్గుతుంది. ఇదేకాదు కూరగాయ పంటల దిగుబడి కూడా తగ్గుతుంది.
ఏం చేయాలి?
ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. అందుకే రైతులు కూడా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంటను కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఐఎండీ(ఇండియన్ మెటియోరాలాజికల్ డిపార్ట్మెంట్) సలహా ఇచ్చింది. మొక్కలకు కావాల్సినప్పుడల్లా నీటిని అందించాలి. వీలైతే.. మల్చింగ్ చేసుకోవాలి. మల్చింగ్ వల్ల నేలలోని తేమ కాపాడొచ్చు. విత్తనాలు కూడా సరైన టైంలో నాటాలి. వాతావరణ పరిస్థితులను తట్టుకుని పండే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు కొన్ని రకాల మిల్లెట్స్ వేడి, చలి నుంచి తట్టుకుని బాగా పండుతాయి. అలాంటివాటిని సాగు చేస్తే రైతులకు నష్టాలు తగ్గుతాయి.